KL Rahul: టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌.!

ఇటీవల టీమ్‌ఇండియా వన్డే పగ్గాలను ఓపెనర్‌ రోహిత్ శర్మకు అప్పగించిన సెలెక్షన్‌ కమిటీ.. త్వరలోనే యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ని వైస్‌ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని విశ్వసనీయ..

Published : 09 Dec 2021 16:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల టీమ్‌ఇండియా వన్డే పగ్గాలను ఓపెనర్‌ రోహిత్ శర్మకు అప్పగించిన సెలెక్షన్‌ కమిటీ.. త్వరలోనే యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ని వైస్‌ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇన్నాళ్లు కోహ్లీకి డిప్యూటీగా ఉన్న రోహిత్‌కి‌.. బీసీసీఐ తాజాగా కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. దీంతో తదుపరి వైస్‌ కెప్టెన్‌ ఎవరు అనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటన కోసం వన్డే జట్టును ప్రకటించే సమయంలోనే.. కేఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి.

‘యువ ఆటగాడు కేఎల్ రాహుల్‌ గత కొన్నేళ్లుగా మెరుగ్గా రాణిస్తున్నాడు. అతడు ఇంకో ఏళ్లు క్రికెట్‌ ఆడగలడు. అందుకే టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ పదవికి అతడు సరిపోతాడనిపిస్తోంది. కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్ శర్మల నుంచి చాలా విషయాలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి కూడా కేఎల్‌ రాహుల్ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. మరోవైపు, యువ వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌ని వైస్‌ కెప్టెన్‌గా నియమించే విషయంపై కూడా బీసీసీఐ వర్గాలు చర్చిస్తున్నాయి. ‘రిషభ్‌ పంత్‌ ఇంకా సీనియర్ల నుంచి నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఇప్పుడే బాధ్యతలు అప్పగిస్తే.. అతడిపై మరింత భారం మోపినట్లవుతుంది. అందుకే పంత్ విషయంలో మరి కొంత కాలం వేచి చూస్తే మంచిదనిపిస్తోంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తనకు తానుగా టీ20 కెప్టెన్సీని వదులుకున్న కోహ్లి.. తాజాగా సెలెక్షన్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంతో అయిష్టంగానే వన్డే పగ్గాలను వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం టెస్టు ఫార్మాట్‌కు మాత్రమే కోహ్లి నాయకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని