రెండో టెస్టులో అతడికే చోటు: గావస్కర్‌

చెన్నై వేదికగా జరగనున్న రెండో టెస్టులో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని దిగ్గజ క్రికెటర్‌ సునిల్ గావస్కర్ అన్నాడు. అదే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల ..

Published : 10 Feb 2021 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై వేదికగా జరగనున్న రెండో టెస్టులో స్పిన్నర్‌ కుల్‌దీప్‌యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని దిగ్గజ క్రికెటర్‌ సునిల్ గావస్కర్ అన్నాడు. అదే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే నదీమ్‌ నాలుగు వికెట్లు తీసినప్పటికీ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురాలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో కుల్‌దీప్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

‘‘కాస్త వైవిధ్యంగా బంతులు విసిరే కుల్‌దీప్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాషింగ్టన్‌ సుందర్‌, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ ఆఫ్‌ స్పిన్నర్లు. అశ్విన్ ‌గాల్లో నెమ్మదిగా బంతులు వేస్తే, సుందర్ వేగంగా విసురుతాడు. కాబట్టి నదీమ్‌/సుందర్‌ స్థానంలో కుల్‌దీప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 85* పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడిన సుందర్‌ను తప్పించలేరు. అయితే ఎవరు జట్టులోకి వచ్చినా ఇంగ్లాండ్‌ను తక్కువస్కోరుకే కట్టడి చేయడానికి ప్రయత్నించాలి’’ అని గావస్కర్ సూచించాడు.

‘‘తొలి టెస్టులో నదీమ్ కాస్త భయపడ్డాడు. అతడి బౌలింగ్‌ను ఉద్దేశించి చెప్పట్లేదు. అతడు వేసిన నో బాల్స్‌ గురించి మాట్లాడుతున్నా. స్పిన్‌లో ఆత్రుతతో బంతులు వేయాలనుకున్నప్పుడే క్రీజును దాటుతుంటారు. అశ్విన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎన్నో ఏళ్ల తర్వాత అతడు నోబాల్స్‌ వేశాడు. టీమిండియా వీటిపై దృష్టిసారించాలి’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో 20, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు నోబాల్స్‌ వేశారు. వీటిలో నదీమ్‌‌ 9 నోబాల్స్ వేశాడు. కాగా, చెన్నై వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి

చెపాక్‌ ఓటమి: 5 కారణాలివే!

చెన్నె టెస్టు: భారత్‌ ఘోర ఓటమి.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని