Michael Vaughan: కోహ్లీసేనను రక్షించేందుకే వర్షం వచ్చిందంట! వాన్‌ వెటకారం!!

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ టీమ్‌ఇండియాపై సెటైర్లు వేయడం ఇంకా మానుకోలేదు! ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు వర్షంతో నిలిచిపోయిన సందర్భంలోనూ అతడు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. కోహ్లీసేనను రక్షించేందుకే వరుణుడు వచ్చాడట!..

Published : 09 Aug 2021 13:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ టీమ్‌ఇండియాపై సెటైర్లు వేయడం ఇంకా మానుకోలేదు! ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు వర్షంతో నిలిచిపోయిన సందర్భంలోనూ అతడు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. కోహ్లీసేనను రక్షించేందుకే వరుణుడు వచ్చాడట! అని.

ఆంగ్లేయులపై తొలి టెస్టు గెలిచి శుభారంభం చేసే అవకాశం టీమ్‌ఇండియాకు త్రుటిలో చేజారింది. ఆట ఆఖరి రోజు వర్షం రావడమే ఇందుకు కారణం. ఈ పోరులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జో రూట్‌ సేనను కోహ్లీసేన దెబ్బకొట్టింది. జస్ప్రీత్‌ బుమ్రా (4/46), మహ్మద్‌ షమి (3/28) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే కుప్పకూలింది. కేఎల్‌ రాహుల్‌ (84), రవీంద్ర జడేజా (56) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 278 పరుగులు చేసింది.

రెండో ఇన్నింగ్స్‌ను 98 పరుగుల లోటుతో ఆరంభించిన ఇంగ్లాండ్‌ 303 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (109) శతకం చేయడంతో ఫర్వాలేదనిపించింది. 205 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన భారత్‌ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 52/1తో నిలిచింది. ఆఖరి రోజు 150 పైచిలుకు పరుగులు చేయడం కోహ్లీసేనకు కష్టమేం కాదు. అలాంటి సమయంలో రోజంతా వర్షం కురవడంతో ఆటను రద్దు చేశారు. ఫలితంగా మ్యాచ్‌ డ్రా అయింది.

భారత్‌ గెలుపు అవకాశాలను వరుణుడు దెబ్బకొట్టడంతో మైకేల్‌ వాన్‌ సెటైర్‌ వేశాడు. ‘చూస్తుంటే ఇక్కడ భారతీయులను వర్షం రక్షిస్తున్నట్టు ఉంది..’ అని ట్వీట్‌ చేశాడు. పరోక్షంగా ఇది ఆంగ్లేయులను ఉద్దేశించి చేసిందే అయినా భారత జట్టుపై అతడు విసిరే వ్యంగ్య ట్వీట్ల గురించి మనకు తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని