2011 ధోనీసేనపై మేమే గెలిచేవాళ్లం: కపిల్‌ డెవిల్స్‌ 

పిల్‌దేవ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా 1983లో తొలిసారి ప్రపంచకప్‌ సాధించి శుక్రవారానికి 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నాటి సభ్యులతో కలిసి ఓ జాతీయ ఛానెల్‌ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.

Updated : 26 Jun 2021 13:38 IST

అమ్మ పుట్టినరోజున మ్యాచ్‌ గెలిపించానన్న సందీప్‌ పాటిల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా 1983లో తొలిసారి ప్రపంచకప్‌ సాధించి శుక్రవారానికి 38 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నాటి సభ్యులతో కలిసి ఓ జాతీయ ఛానెల్‌ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందులో అప్పటి దిగ్గజాలంతా పాల్గొని, నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. అయితే 2011లో ధోనీసేన కూడా శ్రీలంకను ఓడించి రెండోసారి వన్డే విశ్వవిజేతగా నిలిచింది. భారత్‌ తరఫున కపిల్‌ తర్వాత మహీనే ఆ ఘనత సాధించాడు. దాంతో ఆ రెండుజట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహిస్తే ఎవరు గెలుస్తారని అడిగిన ప్రశ్నకు కపిల్‌ డెవిల్స్‌లోని సభ్యులైన మదన్‌లాల్‌, రోజర్‌ బిన్నీ తామే గెలిచేవాళ్లమని చెప్పారు.

1983, 2011 టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ విజేత జట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహిస్తే ఎవరు గెలిచేవాళ్లని యాంకర్‌ అడిగారు. దానికి స్పందిస్తూ ‘కచ్చితంగా మేమే గెలిచేవాళ్లం. మా జట్టులో అందరూ పోరాడే ఆటగాళ్లే ఉన్నారు. అందువల్ల ప్రపంచకప్‌ను వదిలేవాళ్లు కాదు. ప్రతి ఒక్కరూ బాగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. దాంతో ఎలాగైనా గెలిచేవాళ్లం’ అని మదన్‌లాల్‌ జవాబిచ్చారు. అనంతరం రోజర్‌ బిన్నీ స్పందిస్తూ ‘ఆ మ్యాచ్‌ను లార్డ్స్‌లో నిర్వహిస్తే తప్పకుండా మేమే గెలిచేవాళ్లం’ అని పేర్కొన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో సందీప్‌ పాటిల్‌ మాట్లాడుతూ, ఆ టోర్నీలో తనకెంతో ఇష్టమైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. సెమీఫైనల్స్‌లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌పై గెలవడం తనకు ప్రత్యేకమని చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు తన తల్లి పుట్టినరోజని, ఆ మ్యాచ్‌ జరిగే రోజు ఆమె ఓ మంచి బహుమతిని ఇవ్వమని కోరారని సందీప్‌ గుర్తుచేసుకున్నారు. దాంతో ఆ మ్యాచ్‌లో తాను 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినట్లు స్వీయ అనుభవాన్ని సంతోషంగా వివరించారు. జూన్‌ 22న జరిగిన ఆ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టును ఓడించి విండీస్‌తో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని