IND vs AUS: బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ.. గెలిచేది ఆ జట్టే: మహేల జయవర్దనే

ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆసీస్ (IND vs AUS) మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై శ్రీలంక మాజీ బ్యాటర్ మహేల జయవర్దనే (Mahela Jayawardene) విశ్లేషణ చేశాడు.   

Published : 06 Feb 2023 14:25 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకానున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఏ జట్టు విజయం సాధిస్తుందనే దానిపై శ్రీలంక మాజీ బ్యాటర్‌ మహేల జయవర్దనే తన అంచనాను వెల్లడించాడు. రెండు పటిష్టమైన జట్లే అని పేర్కొంటూ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. 

‘ఆసీస్-భారత్ మధ్య బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ఎప్పటికీ చారిత్రాత్మకంగానే ఉంటుంది. భారత పరిస్థితులను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌కు మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. అయితే, తొలి టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో వారికి ఒక మంచి ప్రారంభం దొరికినట్లవుతుంది. కానీ, ఎవరు విజేతగా నిలుస్తారనేది మాత్రం అంచనా వేయడం కష్టం. ఈ సిరీస్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని భావిస్తున్నా. 2-1 తేడాతో సిరీస్‌ను ఆసీస్‌ కైవసం చేసుకుంటుంది. కానీ, ఆస్ట్రేలియాకు భారత్‌ గట్టి పోటీని ఇస్తుంది’ అని జయవర్దనే పేర్కొన్నాడు.  

 తొలిసారి 1996-97లో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని టీమ్‌ఇండియా కైవసం చేసుకొంది. అలాగే 2016 - 17, 2018 -2019, 2020 - 2021 సీజన్లలోనూ భారత జట్టే (Team India) ట్రోఫీని గెలుచుకొంది. ఈసారి ట్రోఫీని కూడా సొంతం చేసుకొంటే.. నాలుగు టెస్టుల సిరీస్‌ను వరుసగా నాలుగో సారి కూడా సొంతం చేసుకొన్న జట్టుగా భారత్‌ అవతరిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని