జెర్సీ వేసుకొని రాత్రంతా ధోనీ ఏడ్చాడు!

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్‌ ధోనీకి టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ శుభాకాంక్షలు తెలియజేశాడు. దేశ క్రికెట్‌కు అతడెంతో సేవ చేశాడని ప్రశంసించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మహీ కొన్నిసార్లు భావోద్వేగానికి గురవుతాడని తెలిపాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు...

Published : 19 Aug 2020 17:17 IST

టెస్టు వీడ్కోలు తర్వాత ఏం జరిగిందో చెప్పిన అశ్విన్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్‌ ధోనీకి టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ శుభాకాంక్షలు తెలియజేశాడు. దేశ క్రికెట్‌కు అతడెంతో సేవ చేశాడని ప్రశంసించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మహీ కొన్నిసార్లు భావోద్వేగానికి గురవుతాడని తెలిపాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన రోజు టీమ్‌ఇండియా జెర్సీ ధరించి కన్నీరు కార్చాడని వివరించాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో యాష్‌ మాట్లాడాడు.

‘2014లో మహీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం నాకు గుర్తుంది. మెల్‌బోర్న్‌లో మ్యాచ్‌ను కాపాడేందుకు ఆ రోజు మేమిద్దరం ఎంతో కష్టపడ్డాం. కానీ మేం ఓడిపోయాం. అప్పుడతను స్టంప్‌ తీసుకొని ఇక నేను ముగించేస్తున్నా అని సాధారణంగా చెప్పాడు. అదో భావోద్వేగ సన్నివేశం. నేనూ, సురేశ్‌ రైనా, ఇషాంత్‌ శర్మ సాయంత్రం మహీ గదిలోనే కూర్చున్నాం. ఆ రాత్రంతా అతడు టీమ్‌ఇండియా జెర్సీలోనే ఉన్నాడు. కన్నీరు కార్చాడు’ అని అశ్విన్‌ తెలిపాడు.

మహీతో తనకు ఎన్నో మరుపురాని సంఘటనలు ఉన్నాయని యాష్‌‌ అన్నాడు. చెపాక్‌లో భారత్‌-వెస్టిండీస్‌ టెస్టు మ్యాచ్‌ జరిగేటప్పుడు తొలిసారి ధోనీని కలిశానన్నాడు. అప్పుడు నెట్‌బౌలర్‌గా ఉన్నానని పేర్కొన్నాడు. 2008లో చెన్నై సూపర్‌కింగ్స్‌లో చేరానని తెలిపాడు. అతడి వద్ద చాలా సమయం గడిపి ఎంతో నేర్చుకున్నానని వివరించాడు. 2010 ఛాంపియన్స్‌ లీగ్‌లో మహీ తనకో ముఖ్యమైన పాఠం చెప్పాడని అన్నాడు.

‘విక్టోరియా బస్‌రేంజర్స్‌తో మ్యాచులో నేను సూపర్ ఓవర్‌ వేశాను. అప్పుడు ఎంఎస్‌ నా దగ్గరికొచ్చి ఒత్తిడిలో నేను అత్యుత్తమంగా బంతులు వేయలేదని చెప్పాడు. క్యారమ్‌ బంతిని ఎక్కువగా ఉపయోగించాలని సలహా ఇచ్చాడు’ అని యాష్‌ గుర్తు చేసుకున్నాడు. అలాగే 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో తాను వికెట్లు తీయకున్నా ఎంతో ప్రోత్సహించాడని తెలిపాడు. ఓ పక్క జడేజాకు వికెట్లు పడుతున్నా.. నీ బౌలింగ్‌ విధానం, ఆలోచనా విధానం బాగుందని ఇలాగే కొనసాగాలని అండగా నిలిచాడని అశ్విన్‌ పేర్కొన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని