T20 World Cup 2007: అప్పుడు ఆఖరి ఓవర్‌ వేసేందుకు భారత బౌలర్లు కాస్త జంకారు: మాలిక్‌

తొలి టీ20 ప్రపంచకప్‌ను ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా కైవసం చేసుకొంది. పాక్‌పై చివరి ఓవర్‌లో జోగిందర్‌ శర్మ అద్భుతం చేయడంతో పాకిస్థాన్‌పై కేవలం 5 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.

Published : 15 Nov 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్‌ ఐదు పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి అరంగేట్ర కప్‌ను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. అప్పటి టీమ్‌ఇండియా సారథి ఎంఎస్ ధోనీ అద్భుత నాయకత్వ పటిమతో జట్టును గెలిపించాడు. చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమైనప్పుడు జోగిందర్‌ శర్మ చేతికి బంతిని ఇచ్చి సత్ఫలితం రాబట్టాడు. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌ సొంతం చేసుకుంది. అది కూడా ఫైనల్‌లో పాక్‌ను ఇంగ్లిష్ జట్టు ఓడించింది. అప్పటి సంఘటనను పాక్‌ సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ గుర్తు చేసుకొన్నాడు. 

‘‘ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా చివరి ఓవర్‌ వేసేందుకు భారత టాప్‌ బౌలర్లు ముందుకు రాలేదు. అయితే వారి పేర్లను ప్రస్తావించడం సరైంది కాదు. ఎంఎస్ ధోనీ అందరినీ అడిగి చివరికి జోగిందర్ శర్మ చేతికి బంతినిచ్చాడు. మిస్బా బ్యాటింగ్‌కు టాప్‌ బౌలర్లు కాస్త భయపడ్డారు. మైదానం నలువైపులా షాట్లు కొట్టాడు. అయితే, స్కూప్‌ షాట్‌ గురించి మాత్రమే అంతా మాట్లాడతారు. ఒకవేళ చివరి వికెట్‌ కాకుండా ఉంటే తప్పనిసరిగా అలాంటి షాట్‌కు మిస్బా వెళ్లే వాడు కాదని గట్టిగా చెబుతా. ఎందుకంటే అప్పటికే జోగిందర్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టాడు’’ అని మాలిక్‌ వివరించాడు. 

అయితే షోయబ్‌ మాలిక్‌ చెప్పినట్లు అప్పటికే టాప్‌ పేసర్లు ఆర్పీ సింగ్‌, శ్రీశాంత్, ఇర్ఫాన్‌ పఠాన్‌ ఓవర్ల కోటా ముగిసింది. జోగిందర్‌ శర్మకు ఒకటి, యూసఫ్‌ పఠాన్‌కు 3, హర్భజన్‌ సింగ్‌కు ఒక ఓవర్‌ మాత్రమే మిగిలి ఉంది. దీంతో మిస్టర్ కూల్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చివరికి జోగిందర్‌ శర్మవైపే మొగ్గు చూపాడు. ఆ తర్వాత చరిత్ర మీకు తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని