Sanju Samson: ఆ విషయంలో సూర్యకుమార్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి: సంజూ కోచ్‌

కొంత కాలంగా సంజూ శాంసన్‌కు జట్టులో సరైన అవకాశాలు రాకపోవడంపై అతడి చిన్ననాటి కోచ్‌ బిజు జార్జ్‌ స్పందించాడు.

Updated : 30 Nov 2022 06:37 IST

దిల్లీ: కొంత కాలంగా సంజూ శాంసన్‌కు జట్టులో సరైన అవకాశాలు రాకపోవడంపై అతడి చిన్ననాటి కోచ్‌ బిజు జార్జ్‌ స్పందించాడు. ఈ విషయంలో అభిమానులు పంత్‌ను తప్పుపట్టడం సరైంది కాదన్నాడు. మరోవైపు కొందరు అభిమానుల అత్యుత్సాహం వల్ల ఈ ఆటగాడిని బీసీసీఐకి వ్యతిరేకంగా భావించే అవకాశం ఉందన్నాడు. ఇక జట్టులో స్థానం విషయంలో సంజూ సూర్యకుమార్‌ యాదవ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించాడు. 

‘‘సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య ఎలాంటి కారణం లేకుండానే రిషభ్‌ పంత్‌ను విమర్శిస్తున్నారు. పంత్ జట్టులో ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. కాబట్టి, ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నాడు. సంజూ, పంత్‌కి మధ్యన ఎలాంటి విభేదాలు లేవు. శాంసన్‌ బ్యాటింగ్ చేయడంలో గొప్ప నేర్పు ప్రదర్శిస్తాడు. పంత్‌ కీపింగ్‌లో దిట్ట. ఇటీవల కేరళ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఇది సరైంది కాదు. సంజూ అంశాన్ని బీసీసీఐకి వ్యతిరేకంగా మలుస్తున్నారు. ఈ విషయంలో క్రికెట్‌ను రాజకీయం చేసేందుకు అక్కడి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు అతడికి అనుకూలంగా లేవు అంతే. వీవీఎస్‌ లక్ష్మణ్‌ లాంటి వారు కోచ్‌గా ఉండగా ఆటగాళ్లను తొక్కేయడం వంటివి జరగవు’’ అని తెలిపాడు. 

సంజూకు సరైన అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ.. ‘‘వికెట్‌ కీపర్‌ స్థానం కోసం పోటీ పడేందుకు ఇషాన్‌ కిషన్‌ మరో సవాలు. చాలా మంది ఫాస్ట్‌ బౌలర్లు 60-70 శాతం రైట్‌ హ్యాండర్లను ఎదుర్కోవడానికే సాధన చేస్తారని.. వారి స్థానంలో లెఫ్ట్‌ హ్యాండర్లను తీసుకుంటే ఫలితం బాగుంటుందని చెబుతారు. నేను దాన్ని నమ్మను. ఎందుకంటే, ఆడేవాడి దగ్గర నైపుణ్యం ఉంటే ఏ చేతితో అయినా ఆడతాడు. సంజూ ఫినిషర్‌గానూ అదరగొడతాడు. ఇక అవకాశాల విషయంలో సంజూ సూర్యకుమార్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే 2015లో జింబాబ్వేతో టీ20 సిరీస్‌ తర్వాత ఐదేళ్లు తన స్థానం కోసం ఎదురుచూశాడు. మళ్లీ 2020లో పుణెలో శ్రీలంకతో మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆనాటి నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు’’ అంటూ బిజు కొనియాడాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని