Mega Auction : గత సీజన్‌లో అదిరిపోయే ధర.. మరి ప్రస్తుతం వారి పరిస్థితేంటి?

ఆడితే చాలు పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు వచ్చి పడుతుంది. అందుకే దేశవాళీ, అంతర్జాతీయంగా...

Updated : 29 Mar 2022 19:39 IST

ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలం రెండు రోజులపాటు (శనివారం, ఆదివారం) బెంగళూరు వేదికగా జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ, ఐపీఎల్‌ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేశారు. రేపు ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభం కానుంది. అయితే ఈసారి వేలంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే గత సీజన్‌లో అత్యధిక ధరను సొంతం చేసుకున్న క్రికెటర్లను సొంత జట్లు వదిలేయగా మరొక ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. మరి అలాంటి ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందామా...

క్రిస్‌ మోరిస్‌:  రాజస్థాన్‌ రాయల్స్‌ అత్యధిక ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు. దాదాపు రూ. 16.25 కోట్లు సొంతం చేసుకున్న ఈ ఆల్‌రౌండర్‌ గత సీజన్‌లో పెద్దగా రాణించిందేమీ లేదు. తన విలువకు తగ్గ న్యాయం మాత్రం చేయలేకపోయాడు. రెండు విడతలవారీగా జరిగిన 14వ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం 15 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అటు బ్యాటింగ్‌లో అయితే మరీ దారుణం. కేవలం ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చినా.. కేవలం 67 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు మెగా వేలంలో పాల్గొనడం లేదు. 

ప్యాట్‌ కమిన్స్‌: ఆసీస్‌కు చెందిన ఫాస్ట్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్‌) రూ. 15.5 కోట్లకు సొంతం చేసుకుంది. భారత్‌ వేదికగా జరిగిన పద్నాలుగో సీజన్‌ తొలి దశలో మాత్రమే ప్యాట్‌ కమిన్స్‌ ఆడాడు. ఏడు మ్యాచుల్లో 93 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించాడు. తొమ్మిది వికెట్లను పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 3/24. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన కమిన్స్‌ను ఈసారి కేకేఆర్‌ రిటెయిన్‌ చేసుకోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్న కమిన్స్‌కు గతసారి మాదిరిగా భారీ ధర దక్కకపోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 

మ్యాక్స్‌వెల్‌: ఆల్‌రౌండర్‌ అయిన ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌2020లో రాణించని మ్యాక్సీ.. రెండు దశల్లో జరిగిన ఐపీఎల్‌ 2021లో మాత్రం బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 15 మ్యాచులు 14 ఇన్నింగ్స్‌ల్లో 513  పరుగులు చేశాడు. అందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 76 పరుగులు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రిటెయిన్‌ చేసుకుంది. అయితే ఈ సారి రూ. 11 కోట్లను మాత్రమే చెల్లించింది.

సునిల్ నరైన్‌:  కేకేఆర్‌ తరఫున ఆడే ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌ను ఆ ఫ్రాంచైజీ రూ. 12.55 కోట్లకు దక్కించుకుంది. విభిన్నమైన స్పిన్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసే నరైన్‌ను కేకేఆర్‌ రూ. 6 కోట్లతో రిటెయిన్‌ చేసుకుంది. బ్యాటింగ్‌లోనూ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఫలితాలను తారుమారు చేయగలడు. గత సీజన్‌లో కేకేఆర్‌ ఫైనల్‌కు రావడంలోనూ కీలక పాత్ర పోషించాడు. 14 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో 62 పరుగులే చేసినా.. కీలక ఇన్నింగ్స్‌లను ఆడాడు. 

డేవిడ్ వార్నర్‌ ( రూ. 12.55 కోట్లు) : క్రీజ్‌లో ఉంటే ఎంత ప్రమాదకారో టీ20 ప్రపంచకప్‌లో నిరూపించాడు డేవిడ్‌ వార్నర్‌. ఆసీస్‌ కప్‌ సాధించడంలో కీలక పాత్ర వార్నర్‌దే. అందుకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. అయితే గత సీజన్‌లో పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచే తీసేసింది. తొలి దశలో అన్ని మ్యాచ్‌లను (7) ఆడిన వార్నర్‌.. యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచెలో మాత్రం కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఆడాడు. మిగతా మ్యాచుల్లో తుది జట్టులోనూ స్థానం కూడా దక్కలేదు.  దీంతో ఈ సారి ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌తోపాటు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉమ్రాన్‌ మాలిక్, అబ్దుల్‌ సమద్‌ను అట్టిపెట్టుకుంది. ఈ సారి వేలంలో ప్రత్యేక ఆకర్షణగా డేవిడ్ వార్నర్‌ నిలవనున్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లలో ఏదొకటి వేలంలో దక్కించుకుని కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే అవకాశం లేకపోలేదు.

కేఎల్‌ రాహుల్‌: పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు సారథ్యం వహించిన కేఎల్‌ రాహుల్‌ను రూ. 11.95 కోట్లకు సొంతం చేసుకుంది. వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కేఎల్‌ రాహుల్‌ది (626) మూడో స్థానం. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్‌ రిటెయిన్‌ చేసుకోలేదు. దీంతో కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూ కేఎల్‌ రాహుల్‌ను రూ. 17 కోట్లతో ఎంపిక చేసుకుని జట్టు పగ్గాలను అప్పగించింది. మరి కొత్త ఫ్రాంచైజీని కేఎల్ రాహుల్ ఎలా నడిపిస్తాడో వేచి చూడాల్సిందే. 

రషీద్‌ ఖాన్‌: ఎస్‌ఆర్‌హెచ్‌ తురుపుముక్క ఆటగాళ్లలో రషీద్‌ ఖాన్‌ ఒకడు. అతడిని ఫ్రాంచైజీ గతంలో రూ. 8.90 కోట్లకు కొనుగోలు చేసింది. 14 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టిన రషీద్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు 3/36. బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ అప్పుడప్పుడూ మెరుస్తుంటాడు. పది ఇన్నింగ్స్‌ల్లో 83 పరుగులు చేశాడు. మరి ఇంతటి కీలక ఆటగాడు రషీద్‌ ఖాన్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ వదిలేసుకుంది. అయితే నూతన ఫ్రాంచైజీ అహ్మదాబాద్‌ మాత్రం హార్దిక్‌తోపాటు రషీద్‌ ఖాన్‌ను రూ. 15 కోట్లకు మెగా వేలానికి ముందే దక్కించుకుంది.

హార్దిక్‌ పాండ్య: ముంబయి ఇండియన్స్ జట్టులో హార్దిక్‌ పాండ్య కీలక ఆటగాడు. ఆ జట్టు విజయాల్లో ఎన్నోసార్లు తనవంతు పాత్ర పోషించాడు. దీంతో గతేడాది ముంబయి యాజమాన్యం అతడిని రూ.11 కోట్లతో అట్టిపెట్టుకుంది. అయితే, కొంతకాలం కిందట వెన్నెముక శస్త్ర చికిత్స చేసుకున్న పాండ్య తర్వాత బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్‌లో 12 మ్యాచ్‌లు ఆడి బ్యాటింగ్‌లో 14.11 సగటుతో కేవలం 127 పరుగులే చేశాడు. మరోవైపు బౌలింగ్‌లో అసలు బంతే అందుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌ హార్దిక్‌ను వదిలేసుకుంది. మరోవైపు అహ్మదాబాద్‌ రూ. 15 కోట్లతో దక్కించుకుని మరీ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని