T20 League : మెగా వేలం.. అమాంతం రేట్లు పెరిగిపోయాయ్‌!

మెగా వేలం కొందరిపై కాసుల వర్షం కురిపించింది. గత వేలం కంటే ఈ సారి భారీ..

Updated : 29 Mar 2022 14:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 టోర్నీ మెగా వేలం కొందరిపై కాసుల వర్షం కురిపించింది. గత వేలం కంటే ఈ సారి భారీ మొత్తం సొంతం చేసుకుని జాక్‌పాట్‌ కొట్టినవారూ ఉన్నారు. ఇందులో ఎక్కువగా యువ క్రికెటర్లే ఉండటం విశేషం. అందులోనూ వేలంలో భారీ ధరను దక్కించుకున్న క్యాప్‌డ్, అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు ఇద్దరూ టీమ్‌ఇండియాకే చెందినవారు కావడం అభిమానులకు కిక్‌ ఇచ్చేదే. పది ఫ్రాంచైజీలు 204 మంది ఆటగాళ్లను దాదాపు రూ.550 కోట్లకుపైగా వెచ్చించి సొంతం చేసుకున్నాయి. గతం కంటే ఈసారి భారీ ధరను దక్కించుకున్న ఆటగాళ్ల ఎవరు.. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిందనే విషయాలను ఓసారి తెలుసుకుందాం.. 

ఇషాన్‌ కిషన్‌, టిమ్‌ డేవిడ్‌, జోఫ్రా ఆర్చర్‌ : ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఈ మెగా వేలంలో అందరి కంటే ఎక్కువ ధరను సొంతం చేసుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు. ముంబయి రూ. 15.25 కోట్లకు సొంతం చేసుకుంది. గత వేలంలో ఇషాన్‌కి దక్కింది రూ. 6.20 కోట్లు మాత్రమే. వరుసగా రెండేళ్లపాటు (2020, 2021) అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో ఈసారి భారీ డిమాండ్‌ వచ్చింది. ఈ ఏడాదికి అందుబాటులో ఉండడని తెలిసినా జోఫ్రా ఆర్చర్‌ను ముంబయి రూ. 8 కోట్లు పెట్టి మరీ దక్కించుకుంది. అదేవిధంగా యువ ప్లేయర్‌ టిమ్‌ డేవిడ్‌పై భారీగా వెచ్చించడం గమనార్హం. ఈ ఆల్‌రౌండర్‌ కోసం రూ. 8.25 కోట్లను ఖర్చు చేసింది.

దీపక్‌ చాహర్‌ : చెన్నై జట్టులో రవీంద్ర జడేజా తర్వాత అత్యంత విలువైన ఆటగాడు దీపక్ చాహరే. అవునండీ ధోనీ (రూ.12 కోట్లు)ని వెనక్కి నెట్టేసి మరీ వేలంలో రూ. 14 కోట్లను దక్కించుకున్నాడు. ధోనీ, జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్‌లను చెన్నై రిటెయిన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత వేలంలో రూ. 80 లక్షలకే సొంతం చేసుకున్న చెన్నై.. ఈసారి మాత్రం భారీ ధరను చెల్లించాల్సి వచ్చింది. ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న దీపక్‌ చాహర్‌కు ఆ మాత్రం రేటు ఇవ్వక తప్పలేదు. 

కెప్టెన్‌ అయ్యే అవకాశం:  శ్రేయస్‌ అయ్యర్‌ గతంలో దిల్లీ నుంచి రూ 7 కోట్లు అందుకోగా... ఈ సారి కోల్‌కతా రూ. 12.25 కోట్లతో సొంతం చేసుకుంది. ఆ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలూ లేకపోలేదు. నితీశ్‌ రాణాను మరోసారి రూ. 8 కోట్లు ఇచ్చి మరీ దక్కించుకుంది. గత సీజన్‌ వరకు అతడికి చెల్లించింది రూ. 3.4 కోట్లు మాత్రమే. యువ బౌలర్‌ శివమ్‌ మావి కూడా మొన్నటి వరకు రూ. 3 కోట్లను మాత్రమే అందుకోగా.. ఈ సారి రూ. 7.25 కోట్ల ధరను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ప్యాట్‌ కమిన్స్ మాత్రం దాదాపు సగం కోల్పోయి రూ. 7.25 కోట్లకే
పరిమితమయ్యాడు. 

అవేశ్‌, దీపక్‌ హుడా, డికాక్‌, హోల్డర్ ‌: ఆల్‌రౌండర్లతోపాటు బ్యాటర్‌, బౌలర్ల మీద లఖ్‌నవూ ఇన్వెస్ట్‌ చేసింది. డికాక్‌ను రూ. 6.75 కోట్లు, జాసన్‌ హోల్డర్‌ను రూ. 8.75 కోట్లు, దీపక్‌ హుడా రూ. 5.75 కోట్లు, మార్క్‌ వుడ్‌ రూ. 7.50 కోట్లతో సొంతం చేసుకుంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ అవేశ్ ఖాన్‌కు రూ. 10 కోట్ల భారీ మొత్తాన్ని దక్కించుకోవడం విశేషం. గతేడాది అవేశ్‌కు దిల్లీ రూ. 70 లక్షలనే చెల్లించింది. దాదాపు 14 రెట్లు అధికంగా వేలంలో సొంతం చేసుకున్నాడు. జాసన్ హోల్డర్‌కు కూడా హైదరాబాద్‌ రూ. 75 లక్షలే ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా 12 రెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

లివింగ్‌స్టోన్‌, ఓడియన్‌ స్మిత్‌, రాజ్‌ బవా : మెగా వేలంలో లివింగ్‌స్టోన్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ లివింగ్‌ స్టోన్‌ను పంజాబ్‌ రూ. 11.50 కోట్లకు దక్కించుకుంది. 2018 నుంచి వరుసగా మూడేళ్లు రాజస్థాన్‌కే ఆడిన లివింగ్‌ స్టోన్‌కు అధికంగా వచ్చింది రూ. 75 లక్షలే. ఇప్పుడు అధిక ధరను సొంతం చేసుకున్న విదేశీ ఆటగాళ్ల జాబితాలో టాపర్‌. భారత్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ షారుఖ్‌ ఖాన్‌ రూ. 9 కోట్లను దక్కించుకున్నాడు. అదేవిధంగా తొలిసారి మెగా టోర్నీ వేలంలోకి వచ్చిన పాతికేళ్ల విండీస్‌ ఆటగాడు ఓడియన్‌ స్మిత్‌ను కూడా పంజాబ్‌ రూ. 6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఫినిషర్‌గానూ, మిడిల్ ఓవర్లను వేయగల సమర్థుడు. అండర్‌-19 ఆటగాడు రాజ్‌బవా కూడా మంచి ధరను సొంతం చేసుకున్నాడు. రూ. 2 కోట్లకు పంజాబ్‌ దక్కించుకుంది. 

శార్దూల్‌ ఠాకూర్‌, ఖలీల్ అహ్మద్, చేతన్‌ : గత సీజన్ వరకు చెన్నైకి ఆడిన శార్దూల్‌ ఠాకూర్‌ను ఈసారి దిల్లీ తీసుకుంది. మొన్నటి దాకా రూ. 2.60 కోట్లను మాత్రమే అందుకున్న శార్దూల్‌ ఈసారి మెగా వేలంలో రూ. 10.75 కోట్లకు దూసుకెళ్లాడు. అదే విధంగా ఫాస్ట్‌బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ కూడా రూ 5.25 కోట్లను అందుకోనున్నాడు. చేతన్‌ సకారియా కూడా రూ. 4.20 కోట్లను దక్కించుకున్నాడు. వీరందరినీ దిల్లీనే సొంతం చేసుకుంది. 

ఫెర్గూసన్‌, తెవాతియా :  ఇక మొన్నటి వరకు కోల్‌కతాకు ఆడిన లాకీ ఫెర్గూసన్‌ను ఈసారి గుజరాత్‌ రూ. 10 కోట్లు ఇచ్చి మరీ సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్‌ వరకు కేవలం రూ. 1.60 కోట్లను మాత్రమే అందుకున్నాడు. మొన్నటి వరకు రూ. 3 కోట్లను అందుకున్న ఆల్‌రౌండర్‌ రాహుల్ తెవాతియాను ఈసారి రూ. 9 కోట్లకు గుజరాత్‌ చేజిక్కించుకుది. తమిళనాడుకు చెందిన యవ బౌలర్ సాయి కిశోర్‌ అనూహ్య ధరను సొంతం చేసుకున్నాడు. రూ. 3 కోట్లకు గుజరాత్‌ తీసుకుంది.

పడిక్కల్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, బౌల్ట్‌, చాహల్‌ : బెంగళూరు ఓపెనర్‌గా రాణించిన దేవదుత్‌ పడిక్కల్‌కు గత సీజన్‌ వరకు దక్కింది కేవలం రూ. 20 లక్షలే. అయితే ఈ సారి మెగా వేలంలో కనీస ధర రూ. 2 కోట్లుగా నమోదు చేసుకున్న దేవదుత్‌కు భారీ డిమాండ్‌ వచ్చింది. రాజస్థాన్‌ రూ. 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. అదే విధంగా టీమ్‌ఇండియా యువ బౌలర్‌ ప్రసిధ్ కృష్ణకు కాసుల వర్షం కురిసింది. రూ. 10 కోట్లను వెచ్చించి మరీ దక్కించుకోవడం విశేషం. గత సీజన్‌ వరకు రూ. 20 లక్షలను అందుకున్న ప్రసిధ్ జాక్‌పాట్ కొట్టేశాడు. గత సీజన్‌ వరకు రూ. 3.20 కోట్లను తీసుకున్న బౌల్ట్‌ ఈసారి మాత్రం వేలంలో రూ. 8 కోట్లను దక్కించుకున్నాడు. బెంగళూరు బౌలింగ్‌ తురుపుముక్కగా మారిన చాహల్‌ను రూ. 6.50 కోట్లకు రాజస్థాన్‌ సొంతం చేసుకుంది. 

బెంగళూరులో వీరందరికీ జాక్‌పాట్లే: మెగా వేలంలో బెంగళూరు తీసుకున్న టాప్‌ ఆటగాళ్లందరూ అదరగొట్టే ధరను సొంతం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా గత సీజన్‌ అత్యధిక వికెట్లను పడగొట్టిన హర్షల్‌ పటేల్‌, లంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగను రూ. 10.75 కోట్ల చొప్పున దక్కించుకుంది. మొన్నటి వరకు హర్షల్‌ రూ. 20 లక్షలు, హసరంగ రూ. 50 లక్షలను మాత్రమే అందుకున్నారు. పద్నాలుగో సీజన్ కప్‌ను చెన్నై సాధించడంలో డుప్లెసిస్‌ది కీలక పాత్ర. ఈ సారి ఆర్‌సీబీ రూ. 7 కోట్లకు ఆర్‌సీబీ సొంతం చేసుకుంది. గత సీజన్‌ వరకు రూ. 1.60 కోట్లను మాత్రమే చెన్నై చెల్లించింది. ఆసీస్‌ ఆటగాడు హేజిల్‌వుడ్‌కూ రూ. 7.75 కోట్ల భారీ ధర దక్కింది. మొన్నటి వరకు చెన్నై రూ. 2 కోట్లు మాత్రమే ఇచ్చింది.

ఐదుగురికీ అదృష్టం: హైదరాబాద్‌ కొనుగోలు చేసిన ఐదుగురికి అదృష్టం కలిసొచ్చింది. ఇందులో ఇద్దరు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌ (రూ. 8.75 కోట్లు), రోమారియో షెఫెర్డ్‌ (రూ.7.75 కోట్లు) అభిషేక్‌ శర్మ (రూ.6.50 కోట్లు) కాగా.. బ్యాటర్లు నికోలస్‌ పూరన్‌ (రూ.10.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.50 కోట్లు) భారీ మొత్తం దక్కించుకున్నారు. ఇక యువ బౌలర్లు కార్తిక్‌ త్యాగి, టి. నటరాజన్‌ కూడా నాలుగేసి కొట్లను సొంతం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో జాన్‌సెన్‌ను హైదరాబాద్‌ రూ. 4.20 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. సీన్‌ అబాట్‌ కోసం రూ.2.40 కోట్లను వెచ్చించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు