Michael Vaughan: నేనే టీమ్‌ఇండియా క్రికెట్‌ను నడిపించే స్థాయిలో ఉంటేనా..? మైఖేల్‌ వాన్‌ కామెంట్స్

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. సెమీఫైనల్‌ పోరులో ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఇక ఇంగ్లాండ్‌ అయితే ఫైనల్‌లోనూ అదే ఉత్సాహం కొనసాగించి పాక్‌పై విజయం సాధించి టైటిల్‌ విజేతగా నిలిచింది.

Published : 14 Nov 2022 23:57 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంతా ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు మోడల్‌ గురించే చర్చ. వన్డేలు, టీ20లకు ప్రత్యేకంగా మ్యాథ్యూ మ్యాట్స్ కోచ్‌ కాగా.. అలాగే టెస్టులకు మాత్రమే బ్రెండన్ మెక్‌కల్లమ్‌ కోచింగ్‌ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మిగతా జట్లు కూడా ఇదే ఫార్ములాను పాటించాలని టీ20 ప్రపంచకప్‌ విజేత, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్ బట్లర్‌ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ వాన్‌ కూడా ఇదే మోడల్‌ను అనుసరించాలని సూచించాడు. ఇదే క్రమంలో భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డుకు కీలక సూచనలు చేశాడు. తాను భారత క్రికెట్‌ను నడిపించే స్థాయిలో ఉంటే మాత్రం కచ్చితంగా చేసేవాడినని పేర్కొన్నాడు. 

‘‘నేను భారత క్రికెట్‌ను నడిపించే వ్యక్తిని అయితే గర్వం వీడి.. స్ఫూర్తి కోసం ఇంగ్లాండ్‌ వైపు కచ్చితంగా మొగ్గు చూపేవాడిని. గత కొన్నేళ్లుగా తెల్ల బంతి క్రికెట్‌లో ఇంగ్లిష్‌ జట్టు ముందు ఉండటానికి  కారణం అదే. యువకులంతా ఓ జట్టుగా మారి విజేతగా నిలిచారు. తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన జోస్ బట్లర్ ఇంగ్లాండ్‌ను విజేతగా నిలపడం మరింత అభినందనీయం’’

సెమీస్‌లో భారత్‌ను చిత్తు చేయడం.. అలాగే ఫైనల్‌లో పాక్‌పై ఇంగ్లాండ్‌ అద్భుత విజయం సాధించడంపైనా వాన్‌ విశ్లేషించాడు. ‘‘ఇంగ్లాండ్‌కు గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. అలానే మంచి వ్యూహాలను రూపొందించే టీమ్‌ కూడా ఉంది. వారి వద్ద ఉన్న సమాచారంతో అద్భుతం చేశారు. సెమీస్‌లో భారత్‌పై టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకోవడమే ధైర్యంగా వేసిన మొదటి అడుగు. ఎందుకంటే అక్కడ విరాట్ కోహ్లీ వంటి టాప్‌ క్లాస్‌ ప్లేయర్‌ ఉన్నాడు. కచ్చితంగా అతడిని లక్ష్యం చేసుకొని బౌలింగ్‌ చేశారు. అదిల్‌ రషీద్‌ బౌలింగ్‌ అయిపోయేంత వరకు రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌కు దిగలేదు. ఇక ఫైనల్‌లోనూ బౌలింగ్‌ ఎటాక్‌ను చాలా తెలివిగా బట్లర్‌ వాడాడు. ప్రత్యర్థినిబట్టి తన అమ్ములపొదిలోని ఆయుధాలను ఒక్కొక్కటి బయటకు తీసి ప్రయోగించాడు’’ అని మైఖేల్‌ వాన్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని