T20 world cup: పొట్టి ప్రపంచకప్‌ టోర్నీకి భారీ డిమాండ్‌.. 6 లక్షలకుపైగా అమ్ముడైన టికెట్లు

ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల కరోనా పరిస్థితుల అనంతరం జరుగుతున్న మెగా టోర్నీ కావడంతో..ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్‌ నెలకొంది.

Updated : 14 Oct 2022 12:07 IST

(ఫొటో : ఐసీసీ ట్విటర్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌ : మరో మెగా సమరానికి క్రికెట్‌ ప్రపంచం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. దాదాపు రెండేళ్ల కరోనా పరిస్థితుల అనంతరం జరుగుతున్న మెగా టోర్నీ కావడంతో.. ఈ సారి టికెట్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. పెద్దసంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో మ్యాచ్‌లను వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే 6 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.

ఈ పొట్టి ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా సహా కొన్ని జట్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాయి. మిగతా దేశాలూ చేరుకుంటున్నాయి. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో అక్కడ క్రికెట్‌ సందడి మొదలైంది. ఈ నెల 16 నుంచి తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌-12లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలను దక్కించుకోవడం కోసం తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. ఈ నెల 22 నుంచి సూపర్‌-12 సమరం మొదలవుతుంది.

ఈ మెగా టోర్నీకి 7 ఆస్ట్రేలియా నగరాలు వేదికలుగా ఉన్నాయి. సూపర్‌-12లో తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య జరగనుంది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య సిడ్నీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌.. గతేడాది ఫైనల్‌ పోరును తలపించేలా ఉండే అవకాశం ఉంది. ఈ ఆదివారం ప్రారంభ మ్యాచ్‌లతోపాటు సూపర్‌-12 మ్యాచ్‌ల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులను చూసేందుకు తాము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ చీఫ్‌ మిచెల్‌ ఎన్‌రైట్‌ అన్నారు.

చిరకాల ప్రత్యర్థుల పోరుపైనే అందరి దృష్టి..

ఇక అందరి చూపు.. అక్టోబర్‌ 23న జరిగే దాయాదుల పోరుపైనే. చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాక్‌ తలపడే ఈ పోరుకు 90 వేలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అడిషనల్‌ స్టాండింగ్‌ రూమ్‌ టికెట్లు కూడా 10 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌ జరిగే మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానం.. అభిమానులకు అసలైన క్రికెట్‌ మజాను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు