Dhoni: రిటైర్‌మెంట్‌పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐదో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుని కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ముంబయి సారథి రోహిత్ శర్మతో సమంగా నిలిచాడు. ఐదో టైటిల్‌ను నెగ్గడం కంటే ధోనీ రిటైర్‌మెంట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Updated : 30 May 2023 08:34 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL) చరిత్రలో ఐదు టైటిల్స్‌ గెలిచిన రెండో జట్టుగా చెన్నై సూపర్  కింగ్స్ (CSK) అవతరించింది. ముంబయిని సమం చేస్తూ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌ మ్యాచ్‌లో (IPl 2023) గుజరాత్‌ టైటాన్స్‌ను చివరి (CSK vs GT) బంతికి ఓడించి మరీ సీఎస్‌కే విజేతగా నిలిచింది. చివరి రెండు బంతులను సిక్స్‌, ఫోర్‌గా కొట్టిన రవీంద్ర జడేజాను ఎత్తుకుని మరీ ధోనీ (MS Dhoni) సంబరాలు చేసుకున్నాడు. కెప్టెన్‌ కూల్ నాయకత్వంలో చెన్నై చిరస్మరణీయ విజయంతో కప్‌ను ఎగరేసుకుపోయింది. తనకిదే చివరి సీజన్‌గా భావించిన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెబుతూ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌ అనంతరం వ్యాఖ్యాత హర్షా భోగ్లే ప్రశ్నకు అతడు బదులిచ్చాడు. 

సమాధానం కోసం వేచి ఉన్నారా..?

నా రిటైర్‌మెంట్‌పై సమాధానం కోసం మీరు చూస్తున్నారా..? దానిపై ప్రకటన చేయడానికి ఇది సరైన సమయమే. కానీ, ఈ ఏడాది నేను ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల నుంచి భారీగా ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నా. ఇలాంటప్పుడు అందరికీ థాంక్స్‌ అని చెప్పడం చాలా సులువు. అయితే, నాకు కష్టమైన విషయం ఏంటంటే.. మరో 9 నెలలు శ్రమించి కనీసం వచ్చే సీజన్‌ అయినా ఆడాలి. ఇదంతా నా శరీరంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. టైటిల్‌ను మా జట్టు నాకు గిఫ్ట్‌ ఇచ్చింది. నాపట్ల వారు చూపిన ప్రేమాభిమానాలకు.. నేను చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఉన్నాయనిపిస్తోంది. 

అప్పుడే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి..

నా కెరీర్‌కు చివరి దశ కావడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యా. తొలి మ్యాచ్‌ కోసం బరిలోకి దిగినప్పుడు అభిమానులు నా పేరును పలుకుతుంటే ఎమోషనల్‌గా మారా. డగౌట్‌లో ఉన్న నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే అనుకున్నా ఈ సీజన్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆడాలని. అలాగే చెన్నై జట్టు పరిస్థితి కూడా ఇదే. తిరిగి వచ్చి మళ్లీ ఆడేందుకు చేయగలిగినదంతా చేస్తా. నన్ను, నా గేమ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులకు రుణపడి ఉంటా. ఇదే సమయంలో నా వ్యక్తిత్వం ఎప్పటికీ మార్చుకోను. ప్రతి ట్రోఫీ ప్రత్యేకమే. అయితే, ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్కంఠ ఉండటమే ఐపీఎల్‌ స్పెషల్. దాని కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. 

అంబటి రాయుడు స్పెషల్

గుజరాత్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లోనూ మా బౌలింగ్ విభాగం కాస్త గాడి తప్పింది. అయితే, బ్యాటింగ్‌ విభాగం ఒత్తిడి తట్టుకుని నిలదొక్కుకుంది. నేను మాత్రం నిరాశపరిచా. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రాణించేందుకు ప్రయత్నిస్తారు. అజింక్య రహానె సహా కొంతమందికి ఎంతో అనుభవం ఉంది. మరీ ముఖ్యంగా అంబటి రాయుడు మైదానంలో వందశాతం శ్రమించే ఆటగాడు. కానీ, అతడు ఉంటే మాత్రం నేను ఫెయిర్ ప్లే అవార్డును మాత్రం (నవ్వుతూ) గెలవలేను. అతడొక అద్భుత క్రికెటర్‌. చాలాకాలం నుంచి అతడితో కలిసి ఆడిన అనుభవం ఉంది. భారత్ - ఎ జట్టు నుంచీ తెలుసు. స్పిన్‌, పేస్‌ను అద్భుతంగా ఆడతాడు. ఈ చివరి గేమ్‌లోనూ ఉత్తమ ప్రదర్శన చేశాడు. రాయుడు కూడా నాలాగే ఎక్కువగా ఫోన్‌ వాడడు. అద్భుతంగా కెరీర్‌ను ముగించిన రాయుడు.. జీవితంలోని తర్వాతి దశను సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా’’ అని ధోనీ తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని