Hardik pandya: ధోనీ చెప్పిన ఆ మాట ఎప్పటికీ మర్చిపోను: హార్దిక్‌ పాండ్యా

ప్రపంచకప్‌ ముంగిట హార్దిక్‌ పాండ్యాకు సబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 19 Oct 2022 16:22 IST

దిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా  అత్యంత సన్నిహితుల్లో ఒకడన్న విషయం తెలిసిందే. తాను క్రికెటర్‌గా నిలదొక్కుకోవడానికి కెప్టెన్‌ కూల్‌ అందించిన సహకారం గురించి పలు సందర్భాల్లో పాండ్యా వెల్లడించాడు. ప్రపంచకప్‌ ముంగిట అతడికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్‌ తనకెంతో ముఖ్యమైందని, కెప్టెన్‌ కూల్‌ చెప్పిన ఓ మాట ఎప్పటికీ మర్చిపోలేనని ఈ వీడియోలో వివరించాడు.  

ఓ క్రీడా ఛానెల్‌తో హార్దిక్‌ మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఏదో ఒకటి సాధించాలని నేను అనుకున్నప్పుడు నాకున్న ఏకైక మార్గం క్రికెట్‌. క్రికెటర్‌ కావడమే లక్ష్యంగా కలలుకనేవాడిని. ధోనీ ఓసారి నాతో అన్న మాటలు నాకెప్పటికీ అలా గుర్తుండిపోతాయి. ఆడేటప్పుడు స్కోర్‌ బోర్డును గమనించు. కానీ కేవలం నీ ఒక్కడి కోసం మాత్రం కాదు. జట్టుకు ఏం అవసరమో చూడు. అదే ఇవ్వు. అప్పుడే నీ వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా టీమ్‌ఇండియా కోసం ఆడగలవని చెప్పాడు. ఇప్పుడు మా అందరి లక్ష్యం గెలిచి ట్రోఫీని అందుకోవడం మాత్రమే’’అని తెలిపాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత ఈ ఆల్‌రౌండర్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత సీజన్‌లో భారత టీ20 లీగ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి గుజరాత్‌ టైటిల్‌ను అందుకున్నాడు. ఆసియాకప్‌లోనూ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని