WTC Final: తుది జట్టు అలా ఉండొద్దు.. అప్పటి పొరపాటును మళ్లీ చేయొద్దు: ఎంఎస్కే ప్రసాద్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈసారైనా గదను గెలుచుకోవాలనే లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగుతోంది.

Published : 02 Jun 2023 18:50 IST

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు (WTC Final) చేరిన భారత్‌ విజేతగా నిలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. తుది జట్టు ఎంపికపై టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. బౌలింగ్‌ విభాగంపైనే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కీలక సూచనలు చేశాడు. గత ఫైనల్‌లో చేసిన పొరపాట్లను మరోసారి పునరావృతం చేయొద్దని పేర్కొన్నాడు. కివీస్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇద్దరు స్పిన్నర్లతో భారత్‌ బరిలోకి దిగింది. ఇలాంటి నిర్ణయమే టీమ్‌ఇండియా నష్టం చేసింది. ఇప్పుడు మరోసారి అలా కాకుండా ఉండాలంటే పిచ్‌ పరిస్థితికి అనుకూలంగా జట్టును ఎంపిక చేయాలని ఎంఎస్కే స్పష్టం చేశారు. అలాగే రిషభ్‌ పంత్ లేని లోటును తీర్చడం కష్టమేని చెప్పాడు. 

ఒకే ప్లాన్‌తో వెళ్లొద్దు..

గత ఫైనల్‌ మ్యాచ్‌కు మనం ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాం. కానీ, వర్షం పడటంతో పిచ్‌ పరిస్థితి మారిపోయింది. అయినా సరే తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు స్థానం కల్పించి కివీస్‌తో మ్యాచ్‌ ఆడేశాం. కానీ, ఇప్పుడు మాత్రం ఆసీస్‌తో తలపడే ఓవల్‌ పిచ్‌ కండీషన్‌ను బట్టి తుది జట్టు ఎంపిక ఉండాలి. ఐదు రోజులపాటు ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. అందుకే, ఒకే ప్లాన్‌కు ఫిక్స్‌ అయిపోకుండా ఉండాలి. 

రిషభ్‌ లేని లోటు స్పష్టం.. 

లెఫ్ట్‌ఆర్మ్‌ వికెట్ కీపర్‌ రిషభ్ పంత్ గతేడాది ప్రమాదం  బారిన పడి కోలుకుంటున్నాడు. ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడటం లేదు. దీంతో అతడి లేని లోటు స్పష్టంగా ఉంది. రిషభ్‌ను పూరించే ఆటగాడు కష్టమే. రిషభ్‌ పంత్ కాకుండా మరే ఇతర వికెట్‌ కీపర్‌ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో సెంచరీలు సాధించలేదు. కానీ,  కేఎస్ భరత్‌ తదుపరి ఛాయిస్‌. ఇషాన్‌ కిషన్‌ కంటే ఇతడే కాస్త బెటర్. టెస్టు మ్యాచ్‌లో రోజంతా కీపింగ్‌ చేయగల సత్తా ఉండాలి. అలాంటి ఫిట్‌గా ఉన్న ఆటగాడినే తీసుకోవాలి. 

అదే డిసైడ్ చేస్తుంది..

రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్ కోహ్లీ, రహానె బ్యాటింగ్‌పైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఆసీస్‌ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఎంత మేర రాణిస్తారనేది చూడాలి.  మిచెల్ స్టార్క్‌, కమిన్స్, హేజిల్‌వుడ్‌ను ఆడటం అంత సులువేం కాదు. గిల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అన్నిఫార్మాట్లలోనూ శుభ్‌మన్‌ గిల్ ఆడగల సమర్థుడు. ఇక భారత బౌలింగ్‌ విభాగంలోని ఇద్దరు టాప్‌ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌, రవీద్ర జడేజాలో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఎవరిని పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకోవడం కూడానూ కష్టమే’’ అని ఎంఎస్కే ప్రసాద్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు