MIw vs RCBw: ముంబయి ఖాతాలో మరో విజయం.. 9 వికెట్ల తేడాతో ఆర్‌సీబీపై గెలుపు

డబ్ల్యూపీఎల్‌లో ముంబయి మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది.

Updated : 06 Mar 2023 23:13 IST

ముంబయి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో ముంబయి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ తన సత్తా చాటింది. డబ్ల్యూపీఎల్‌లో ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన హర్మన్‌ప్రీత్‌ సేన.. అదే జోరును రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. 156 పరుగుల లక్ష్యాన్ని ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి కేవలం 14.2 ఓవర్లలోనే  బాదేసింది. హెలీ మాథ్యూస్‌ (77 నాటౌట్‌; 38 బంతుల్లో 13×4,1×6), బ్రంట్‌ (55 నాటౌట్‌; 29 బంతుల్లో 9×4,1×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో ఆర్‌సీబీ నిర్దేశించిన లక్ష్యం పూచికపుల్లలా మారిపోయింది. భాటియా (23; 19 బంతుల్లో 4×4) పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో ప్రీతీ బోస్‌ ఒక వికెట్‌ పడగొట్టింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన బెంగళూరు జట్టు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటయ్యింది. ప్రారంభంలో దూకుడు ప్రదర్శించినప్పటికీ..వికెట్లు కాపాడుకోవడంలో విఫలం కావడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. బెంగళూరు బ్యాటర్లలో స్మృతి మంధాన (23), సోఫియే డివైన్‌ (16), రిచా ఘోష్‌ (28), ఆహుజా (22), శ్రేయంకా పాటిల్‌ (23), మేఘనా స్కౌట్‌ (20), పెర్రీ  (13) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో హెలీ మాథ్యూస్‌ 3 వికెట్లు తీయగా.. సాయిక్‌ ఇషాక్‌, అమేలియా కేర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్‌,బంట్ర్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి జట్టు ప్రారంభం నుంచే చెలరేగిపోయింది. ఓపెనర్‌ మ్యాథ్యూస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీలకు బాదేసింది. ఆమెకు  భాటియా చక్కని సహకారం అందించింది. అయితే జోరుమీదున్న ఈ జోడీని  ప్రీతీబోస్‌ విడదీసింది. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద భాటియా వికెట్ల ముందు దొకిరిపోయింది. అనంతరం బ్రంట్‌ క్రీజులోకి రావడంతో అగ్నికి వాయువుతోడైనట్లయింది. వీరిద్దరూ కలిసి ఎడాపెడా బాదేశారు. దీంతో 156 పరుగుల లక్ష్యం 14.2 ఓవర్లలోనే పూర్తయింది. ఆల్‌ రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న హెలీ మాథ్యూస్‌  ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని