800వ వికెట్‌ ఎలా తీశానంటే..!

అంతర్జాతీయ క్రికెట్లో మహామహులను తన గింగిరాలు తిరిగే బంతులతో బోల్తా కొట్టించిన శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ తొలుత పేస్‌ బౌలర్‌ అవుదామని అనుకున్నారట. పదమూడేళ్ల వయసులో ఎత్తు ఎక్కువ పెరగడం లేదని తన కోచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు మారమని సలహా ఇచ్చాడని ఆయన...

Published : 11 Aug 2020 11:00 IST

ఇషాంత్‌ను షాట్లు ఆడాలని కోరా: ముత్తయ్య మురళీధరన్‌

(Pic: అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నుంచి)

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్లో మహామహులను తన గింగిరాలు తిరిగే బంతులతో బోల్తా కొట్టించిన శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ తొలుత పేస్‌ బౌలర్‌ అవుదామని అనుకున్నారట. పదమూడేళ్ల వయసులో ఎత్తు ఎక్కువ పెరగడం లేదని తన కోచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు మారమని సలహా ఇచ్చాడని ఆయన చెప్పారు. మొదట ఆఫ్‌స్పిన్‌ మాత్రమే వేశానని తర్వాత అన్ని అస్త్రాలు నేర్చుకున్నానని తెలిపారు. టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ‘డీఆర్‌ఎస్‌ విత్‌ అశ్విన్‌’ షోలో ఆయన తమిళంలో సంభాషించారు.

సుదీర్ఘ ఫార్మాట్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ ముత్తయ్య మాత్రమే. ఆయన రికార్డుకు దరిదాపుల్లో ప్రస్తుతం ఎవ్వరూ లేరు. 800వ వికెట్‌గా ప్రజ్ఞాన్‌ ఓజాను ఔట్‌ చేశారు. అప్పుడు మైదానంలో ఏం జరిగిందో ఆయన వివరించారు. ‘ప్రజ్ఞాన్‌ ఓజాతో నేనేమీ మాట్లాడలేదు. నీరు తాగిన తర్వాత ఇషాంత్‌తో సరదాగా మాట్లాడాను. ఆఖరి వికెట్‌ కాబట్టి షాట్లు ఆడాలని సూచించా. నువ్వెంత ప్రయత్నించినప్పటికీ భారత్‌ గెలవలేదు, కనీసం డ్రా కూడా చేసుకోలేదని చెప్పా. కనీసం నాకు వికెట్‌ ఇస్తే నేనైనా సంతృప్తి చెందుతాను’ అని చెప్పానన్నారు. అయితే అతడు వికెట్‌ ఇవ్వకుండా 15 ఓవర్ల వరకు ఆడాడని బదులుగా తాను ప్రజ్ఞాన్‌ ఓజా వికెట్‌ దక్కించుకున్నానని వెల్లడించారు.

గాలె వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య శ్రీలంక 520/8 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అయితే ఆ తర్వాత మురళీధరన్‌ 5 వికెట్లతో చెలరేగడంతో భారత్‌ 276కు పరిమితమై ఫాలో ఆన్‌ ఆడింది. ఆ ఇన్నింగ్స్‌లోనూ సచిన్‌, లక్ష్మణ్‌ పోరాడినా 338కే కుప్పకూలింది. శ్రీలంక పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి వికెట్‌ కావడంతో ఇషాంత్‌తో తాను సరదాగా మాట్లాడానని ముత్తయ్య అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు