WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. నా తుది జట్టులో జడ్డూ ఉండడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌  (WTC Final 2023) మ్యాచ్‌ కోసం భారత్ - ఆస్ట్రేలియా ఆటగాళ్లు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ఇరు టీమ్‌ల నుంచి ‘తుది జట్టు’ను ప్రకటించాడు. 

Published : 01 Jun 2023 11:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) మ్యాచ్‌ జూన్‌ 7 నుంచి ప్రారంభం కానుంది. భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య ఈ పోరు జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల కీలక ప్లేయర్లు లండన్‌లోని ఓవల్‌ చేరుకుని సాధన మొదలుపెట్టారు. బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో అదరగొట్టిన భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆసీస్‌ తరఫున నాథన్ లియాన్‌, టాడ్ మర్ఫీ నాణ్యమైన స్పిన్నర్లు. అయితే, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ మాత్రం తన డ్రీమ్‌ టెస్టు టీమ్‌లో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తానని చెప్పాడు. ఇరు జట్లలోని కీలకమైన ఆటగాళ్లతో కూడిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ జట్టును హుస్సేన్ ప్రకటించాడు. వారిని తీసుకోవడానికిగల కారణాలను వెల్లడించాడు. 

‘‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌ ఉపఖండంలో కానీ, భారత్‌లో జరిగితే నా జట్టులో రవీంద్ర జడేజాను ఆరో ఆటగాడిగా ఎంపిక చేసుకుంటా. అయితే, ఇప్పుడు చేయను. ఎందుకంటే ఇంగ్లాండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అంటే పేస్‌ బౌలింగ్‌ వేసే కామెరూన్‌ గ్రీన్‌ కీలకమవుతాడు. స్పిన్నర్‌ విషయానికొస్తే రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకుంటా. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ కూడా చేయగల సమర్థుడు. రోహిత్ శర్మ టాప్‌ ఆర్డర్‌ను మాత్రమే కాకుండా నా జట్టును నడిపించే సారథి. రోహిత్ సారథ్యమంటే నాకు చాలా ఇష్టం. శుభ్‌మన్‌ గిల్ ఫామ్‌ను చూస్తే అతడినే తీసుకోవాలి. నా తుది జట్టులో మాత్రం ఉస్మాన్ ఖవాజాకు అవకాశం ఇస్తా. అతడినే రోహిత్‌కు ఓపెనర్‌ జోడీగా పంపిస్తా. మిడిలార్డర్‌లో టాప్‌ క్లాస్‌ ప్లేయర్లు మార్నస్‌ లబుషేన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఆడతారు.

కామెరూన్‌ గ్రీన్‌ ఆరోస్థానంలో ఉంటాడు. అలెక్స్‌ క్యారీని వికెట్‌ కీపర్‌గా తీసుకుంటా. స్పిన్‌ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్‌కే నా ఓటు. ఇక పేసర్ల విషయానికొస్తే.. ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ ఖాయంగా ఉంటారు. చివరి స్థానంలో గాయపడకుండా ఉంటే బుమ్రానే నా ఫస్ట్‌ ఛాయిస్‌.  అతడు అందుబాటులో లేకపోవడంతో షమీ వైపు మొగ్గు చూపుతున్నా. షమీ పేస్‌ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అని హుస్సేన్ వివరించాడు. 

నాజర్ హుస్సేన్ కలల తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌, మహమ్మద్ షమీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని