WTC Final: ఆ సిరీస్‌ కంటే.. మాకిదే గ్రాండ్‌ ఫైనల్‌: ఆసీస్ టాప్‌ స్పిన్నర్ నాథన్ లైయన్

భారత్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు ఆసీస్ టాప్ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్ తెలిపాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లైయన్‌ (83 వికెట్లు) కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

Updated : 02 Jun 2023 16:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జూన్‌ 7వ తేదీ నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final) మ్యాచ్‌ ప్రారంభం కానుంది. దీని కోసం భారత్, ఆస్ట్రేలియా (AUS vs IND) జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. భారత శిబిరంపై కాస్త ఒత్తిడి పెంచేలా ఆసీస్ మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. స్టీవ్‌ స్మిత్, సహాయక కోచ్ డానియల్ వెటోరీ తదితరులు టీమ్‌ఇండియా తుది జట్టుపై మాట్లాడారు. అలాగే, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ కూడా పుజారా, విరాట్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ఈ క్రమంలో ఆసీస్ టాప్‌ స్పిన్నర్ నాథన్‌ లైయన్‌ ఆసీస్‌ సన్నద్ధతపై మాట్లాడాడు. అలాగే ఫైనల్‌ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌లో ఆసీస్‌ తలపడనుంది. ఆ సిరీస్‌ కంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌ తమకు ఇప్పుడు కీలకమని వ్యాఖ్యానించాడు. 

‘‘ఇదే నెలలో మేం యాషెస్‌ సిరీస్‌ ఆడబోతున్నాం. కానీ, అంతకుముందు మా ముందు అతిపెద్ద సవాల్ ఉంది. అదే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌. ఇదే మాకు గ్రాండ్‌ ఫైనల్. ఇక్కడ నుంచే మా క్రికెట్ సీజన్‌ ప్రారంభమవుతుంది. దీని కోసం మేమంతా తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాం.  మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని ఎదురు చూస్తున్నాం. ప్రతి ఒక్క ఆసీస్ అభిమాని యాషెస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారని తెలుసు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్‌  మ్యాచ్‌ను తిలకించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. 

గత సిరీస్‌లో మేం టీమ్‌ఇండియా చేతిలో టెస్టు సిరీస్‌ ఓడపోయాం. భారత్‌ వేదికగా ఆ జట్టును అడ్డుకోవడం చాలా కష్టం. ప్రస్తుతం ఇరు జట్లూ నాణ్యమైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నాయి. కచ్చితంగా గొప్ప మ్యాచ్‌ అవుతుంది. భారత జట్టులో క్లాస్‌ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అలాగే పేస్ దళం కూడా బాగుంది. మా జట్టులోనూ కీలక ప్లేయర్లు ఉన్నారు. గతానుభవాలను వదిలేసి తాజాగా క్రికెట్‌ సీజన్‌ను ప్రారంభిస్తాం. విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని లైయన్ తెలిపాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ ముగిసిన తర్వాత జూన్ 16వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లోనే ఆసీస్‌ యాషెస్‌ సిరీస్ వేటను ప్రారంభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని