IPL 2022 : పాండ్య సేన.. వేస్తుందా ముద్ర?

దేశాల మధ్య అంతరాలు తొలగించేసి.. ప్రపంచ క్రికెట్‌ అభిమానులందరినీ ఏకం చేసి.. సహచరుల్ని ప్రత్యర్థుల్లా, ప్రత్యర్థుల్ని సహచరుల్లా మార్చే టోర్నీ మళ్లొచ్చేసింది. క్రికెట్‌ ప్రేమికుల ఫేవరెట్‌ టోర్నీ ఐపీఎల్‌కు ఇంకో పది రోజుల్లోనే శ్రీకారం. రెండు కొత్త జట్లు.. మెగా వేలం తర్వాత కొత్త రూపు సంతరించుకున్న మిగతా జట్లు.. మారిన ఫార్మాట్‌.. పెరిగిన మ్యాచ్‌లు.. ఇలా ఈసారి లీగ్‌ మరింత వినోదాన్నివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ....

Updated : 16 Mar 2022 07:12 IST

ఐపీఎల్‌-15 
మరో 10 రోజుల్లో

ఈనాడు క్రీడావిభాగం

దేశాల మధ్య అంతరాలు తొలగించేసి.. ప్రపంచ క్రికెట్‌ అభిమానులందరినీ ఏకం చేసి.. సహచరుల్ని ప్రత్యర్థుల్లా, ప్రత్యర్థుల్ని సహచరుల్లా మార్చే టోర్నీ మళ్లొచ్చేసింది. క్రికెట్‌ ప్రేమికుల ఫేవరెట్‌ టోర్నీ ఐపీఎల్‌కు ఇంకో పది రోజుల్లోనే శ్రీకారం. రెండు కొత్త జట్లు.. మెగా వేలం తర్వాత కొత్త రూపు సంతరించుకున్న మిగతా జట్లు.. మారిన ఫార్మాట్‌.. పెరిగిన మ్యాచ్‌లు.. ఇలా ఈసారి లీగ్‌ మరింత వినోదాన్నివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ చాన్నాళ్లకు స్వదేశంలో పూర్తి సీజన్‌ చూడబోతున్నాం. ఈ నేపథ్యంలో జట్ల బలాబలాలేంటో చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ముందుగా కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌పై ఓ లుక్కేద్దాం పదండి.

హ్మదాబాద్‌ కేంద్రంగా గుజరాత్‌ టైటాన్స్‌ ఆవిర్భవించింది. మెగా వేలానికి ముందే గతేడాది అక్టోబర్‌లో దుబాయ్‌లో   జరిగిన వేలంలో కార్పొరేట్‌ వెంచర్స్‌ క్యాపిటల్‌ (సీవీసీ) రూ.5625 కోట్లు పెట్టి గుజరాత్‌ ఫ్రాంఛైజీని సొంతం చేసుకుంది. రూ.15 కోట్లు వెచ్చించి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను దక్కించుకున్న టైటాన్స్‌.. అతడికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ (రూ.15 కోట్లు), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (రూ.8 కోట్లు) లాంటి ఆటగాళ్లతో జట్టును బలోపేతం చేసింది. మెగా వేలంలో మరో 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. పేసర్లు ఫెర్గూసన్‌ (రూ.10 కోట్లు), మహ్మద్‌ షమి (రూ.6.25 కోట్లు), ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాతియా (రూ.9 కోట్లు)లను భారీ ధరకు కొనుక్కుంది.


బలాలు

కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఆ జట్టు ప్రధాన బలం. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని శాసించగల సత్తా వీరికి ఉంది. ముఖ్యంగా రషీద్‌ఖాన్‌ ఎంపిక ఆ జట్టు బలాన్ని ఎంతో పెంచింది. పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే ఈ అఫ్గాన్‌ బౌలర్‌ కచ్చితంగా గుజరాత్‌కు కొండంత అండ. కాగితంపై చూస్తే పాండ్యతో పాటు తెవాతియా, విజయ్‌శంకర్‌ లాంటి ఆల్‌రౌండర్లు ఆ జట్టుకు సమతూకాన్ని తెచ్చేవాళ్లే. మిల్లర్‌, రహ్మతుల్లా గుర్బాజ్‌ లాంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. బౌలింగ్‌లో రషీద్‌ కాకుండా పేసర్‌ మహ్మద్‌ షమి, అల్జారీ జోసెఫ్‌ జట్టు విజయాల్లో కీలకం కాగలరని భావిస్తున్నారు. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో టైటాన్స్‌ బలంగా కనిపిస్తోంది. రషీద్‌, జోసెఫ్‌, షమి లాంటి  ఆటగాళ్లు ఆ జట్టు బౌలింగ్‌కు వైవిధ్యాన్ని తీసుకొస్తున్నారు.


జట్టు

దేశీయ ఆటగాళ్లు: హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా, విజయ్‌ శంకర్‌, గుర్‌కీరత్‌, మహ్మద్‌ షమి, దర్శన్‌ నాల్కండే, వరుణ్‌ ఆరోన్‌, ప్రదీప్‌ సాంగ్వాన్‌, యశ్‌ దయాళ్‌, సాయి సుదర్శన్‌, జయంత్‌ యాదవ్‌

విదేశీయులు: రషీద్‌ఖాన్‌, డేవిడ్‌ మిల్లర్‌, డొమినిక్‌ డ్రేక్స్‌, అల్జారి జోసెఫ్‌, రహ్మతుల్లా గుర్బాజ్‌, మాథ్యూ వేడ్‌

కీలక ఆటగాళ్లు: హార్దిక్‌, రషీద్‌, షమి, శుభ్‌మన్‌.


బలహీనతలు

కెప్టెన్‌ పాండ్య ఆ జట్టు బలమే కాదు బలహీనత కూడా. ఇటీవల కాలంలో ఈ ఆల్‌రౌండర్‌ ఆశించిన ఫామ్‌లో లేడు. గాయాలు, ఫిట్‌నెస్‌ లేమి కారణంగా చాలారోజులు క్రికెట్‌కు దూరంగా ఉండడం మరో ప్రతికూలాంశం. బ్యాటింగ్‌   పక్కనపెడితే బౌలింగ్‌ ఎంతవరకు చేస్తాడనేది ప్రశ్నార్థకం. ప్రస్తుతం పాండ్య 75 శాతం మాత్రమే బౌలింగ్‌ చేసేందుకు ఫిట్‌గా ఉన్నాడన్న వార్తలు గుజరాత్‌కు ఆందోళన కలిగించేవే. బౌలింగ్‌ బాగానే ఉన్నా బ్యాటింగ్‌లో మాత్రం భరోసానిచ్చే ఆటగాళ్లు కనిపించడం లేదు. ఎంతో నమ్మకం పెట్టుకున్న జేసన్‌ రాయ్‌ లీగ్‌ నుంచి తప్పుకుని షాకిచ్చాడు. మిల్లర్‌ ఐపీఎల్‌లో ఎప్పుడూ నిలకడగా ఆడింది లేదు. విజయ్‌ శంకర్‌ పేరుకే ఆల్‌రౌండర్‌ కానీ.. ఐపీఎల్‌ రికార్డు పేలవం. తెవాతియా తన తొలి ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత అంచనాలు అందుకోలేదు. శుభ్‌మన్‌కు తోడు సరైన ఓపెనర్‌ లేకపోవడం కూడా గుజరాత్‌కు ప్రతికూలాంశమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని