Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పంచ్‌

భారత బాక్సింగ్‌ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో..

Updated : 20 May 2022 01:04 IST

ఇస్తాంబుల్‌: భారత బాక్సింగ్‌ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణపతకం గెలిచింది. 52 కిలోల విభాగంలో ఫైనల్‌లో జిట్‌పాంగ్ (థాయ్‌లాండ్‌)పై 5-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది. బౌట్‌ ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించింది. రింగ్‌లో దూకుడుగా కదిలిన ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థిపై ముష్టి ఘాతాలతో విరుచుకుపడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఐదో బాక్సర్‌గా రికార్డు సృష్టించింది. అంతకుముందు మేరీ కోమ్‌, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ మాత్రమే గోల్డ్‌ మెడల్‌ను సాధించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బల్గేరియాలోని సోఫియా వేదికగా జరిగిన 73వ స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లోనూ 52 కేజీల విభాగంలోనే స్వర్ణపతకం గెలుచుకుంది. జూనియర్‌ స్థాయిలో ఆమెకి రెండో స్ట్రాంజా టోర్నమెంట్ పతకం కావడం గమనార్హం. 2019లోనూ బంగారు పతకం కైవసం చేసుకుంది. నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్‌గా గెలవడంతో ఆమె కుటుంబసభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లాల్‌బహదూర్‌ స్టేడియంలో మ్యాచ్‌ లైవ్ వీక్షించిన నిఖత్ జరీన్ తండ్రి జమీల్, బాక్సింగ్‌ కోచ్‌లు, క్రీడాకారులు స్టేడియంలో సంతోషంతో సంబరాలు చేసుకున్నారు.

మన బాక్సర్లు మనల్ని గర్వించేట్లు చేశారు: ప్రధాని మోదీ
యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ విజయం సాధించడంపై ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘మన బాక్సర్లు మనల్ని గర్వించేట్లు చేశారు. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌కు అభినందనలు. కాంస్య పతకాలు సాధించిన మనీష,  పర్వీన్‌ హుడాకు కూడా అభినందనలు’’ అని పేర్కొన్నారు.

జరీన్‌కు అభినందనలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై 

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన యువబాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అభినందనలు తెలిపారు. నిఖత్‌ జరీన్‌ను చూసి తెలంగాణ గర్విస్తోందన్నారు. 

జరీన్‌ విశ్వవిజేతగా నిలవడం రాష్ట్రానికి గర్వకారణం: సీఎం కేసీఆర్‌

యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. జరీన్‌ విశ్వవిజేతగా నిలవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని తెలిపారు. యువక్రీడాకారులను తీర్చిదిద్దేందుకు  ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం పేర్కొన్నారు.  

నిఖత్‌ జర్నీ అందరికీ స్ఫూర్తి: తెదేపా అధినేత చంద్రబాబు
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్‌ జరీన్‌కు  తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. పురుషాధిక్యం ఉన్న క్రీడలో ఎన్నో ఇబ్బందులను తట్టుకొని నిజామాబాద్‌ బిడ్డ నిఖత్‌ జరీన్‌ తనకంటూ గుర్తింపు తెచ్చుకుందని చంద్రబాబు అన్నారు. తన ప్రయాణం అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. నిఖత్‌ విజయం పట్ల గర్విస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. 

రూ. లక్ష ప్రోత్సాహం ప్రకటించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

నిఖత్‌ జరీన్‌ విజయం పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అభినందనలు తెలిపారు. జరీన్‌ గెలుపు తెలంగాణ, నిజామాబాద్‌ జిల్లాకు గర్వకారణమని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్‌లో జరీన్‌ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జరీన్‌కు వ్యక్తిగతంగా రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందేలా చొరవ తీసుకుంటానని తెలిపారు.  



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని