Cricket News : బౌలర్లే.. కానీ బాల్‌ వేస్తే 160 కి.మీ.పైనే..

క్రికెట్‌లో నిప్పులు చెరిగే బంతులు.. అనే మాటను తరచూ..

Updated : 22 Feb 2022 17:42 IST

టీమ్‌ఇండియా నుంచి అత్యధిక వేగం ఎంతంటే?

అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌లో నిప్పులు చెరిగే బంతులు.. అనే మాటను తరచూ వింటుంటాం.. 90 మైళ్ల వేగంతో బంతిని విసిరితే వామ్మో అనేవారు. ఇక వందమైళ్ల స్పీడ్‌ అంటే అద్భుతమే అని చెప్పాలి. ఇద్దరు మాత్రమే వంద మైళ్ల వేగంతో బంతులను సంధించారు. తొలిసారి సంధించి అందరిచేతా ఔరా అనిపించాడు ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’‌. ఇంతకీ ఏ జట్టు మీద, ఎప్పుడు విసిరాడు.. తర్వాత స్థానంలో ఎవరున్నారు.. టీమ్‌ఇండియా తరఫున ఎవరు అత్యధిక వేగంతో బంతిని సంధించారనే విషయాలను ఓసారి తెలుసుకుందాం.. 

అందుకే ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌’

రెండు దశాబ్దాల కిందట అరవీర భయంకర బౌలర్లలో పాక్‌ మాజీ ప్లేయర్‌ షోయబ్‌ అక్తర్‌ ఒకడు. సగటున ఓ రైలు ఎంత వేగంతో వెళ్తుందో.. అక్తర్‌ బౌలింగ్‌ స్పీడ్ కూడా అలానే ఉంటుంది. అందుకేనేమో రావల్పిండి ప్రాంతానికి చెందిన అక్తర్‌కు ‘రావల్పిండి ఎక్ప్‌ప్రెస్‌’ అనే పేరూ వచ్చింది. వంద మైళ్ల స్పీడ్‌తో (160 కి.మీపైగా) బంతిని సంధించి ఔరా అనిపించాడు. ఇది జరిగి నేటికి సరిగ్గా 19 ఏళ్లు.. 2003 ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఒక ఓవర్‌లో 100.2 మైళ్ల (161.3 కి.మీ) స్పీడ్‌తో బంతిని విసిరాడు. మిగిలిన ఐదు బంతులను 158కి.మీ సగటు వేగంతో సంధించడం గమనార్హం. 


‘టైట్‌’ బౌలింగ్‌

అక్తర్ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన షాన్ టైట్‌ అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 2010లో ఇంగ్లాండ్‌పై వంద మైళ్లకుపైగా (161.1 కి.మీ) వేగంతో బంతిని విసిరాడు. 2007 ప్రపంచకప్ సందర్బంగా బ్రెట్‌లీ గాయపడటంతో జట్టులోకి వచ్చిన టైట్‌ అత్యధిక వికెట్లు (23) తీసిన రెండో బౌలర్‌గా అవతరించాడు. ఆసీస్ తరఫున 3 టెస్టులు, 35 వన్డేలు, 21 టీ20లు ఆడిన టైట్‌ 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 


వందకు కాస్త తక్కువ..

2003, 2007 ప్రపంచకప్‌లను ఆస్ట్రేలియా కైవసం చేసుకోవడంలో బ్రెట్‌ లీ  కీలక పాత్ర పోషించాడు. షోయబ్ అక్తర్‌ తర్వాత అత్యంత నిలకడగా వేగవంతమైన బంతులను సంధించేది కేవలం బ్రెట్‌లీ మాత్రమే. 2005లో నేపియర్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా 160.8 కి.మీ (99.9 మైళ్లు) స్పీడ్‌తో బంతిని విసిరాడు. ఆసీస్‌కే చెందిన జెఫ్‌ థామ్‌సన్ (1975) మొదటిసారిగా 160 కి.మీపైగా వేగంతో బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. విండీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా 160.6 కి.మీ వేగంతో బంతిని విసిరాడు. మిచెల్‌ స్టార్క్‌ కూడా 2015లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 160.4 కి.మీ వేగంతో బౌలింగ్‌ చేశాడు. వీరంతా వంద మైళ్లకు కొద్ది తేడాతో బంతిని సంధించడం విశేషం. 


ఇక టీమ్ఇండియా బౌలర్ల సంగతికొస్తే.. 

టీమ్‌ఇండియా బౌలర్లలో అత్యంత వేగవంతమైన బౌలర్‌ జవగళ్ శ్రీనాథ్.. అయితే ఇది అనధికారికం సుమీ.. 1996/97 సీజన్‌లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా శ్రీనాథ్‌ 157 కి.మీ మార్క్‌ను తాకాడు. అయితే సరైన స్పీడ్‌గన్స్‌ లేకపోవడంతో అధికారిక జాబితాలోకి ఎక్కలేదు. 1999 ప్రపంచకప్‌లో 149.6 కి.మీ వేగంతో శ్రీనాథ్ బంతిని సంధించాడు. ఆ వరల్డ్‌కప్‌ పోటీల్లో షోయబ్‌ తర్వాత అత్యధిక వేగవంతమైన బంతి ఇదే కావడం విశేషం. 

* ఇర్ఫాన్‌ పఠాన్‌ : భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సంధించిన బంతే ఇప్పటికీ వేగవంతమైంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో 153.7 కి.మీ వేగంతో బంతిని విసిరాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అరుదైన రికార్డును సృష్టించాడు. 

* జస్ప్రీత్ బుమ్రా : డెత్‌ ఓవర్లలో యార్కర్లను వేయడంలో దిట్ట అయిన బుమ్రా టీమ్‌ఇండియా కీలక బౌలర్‌గా ఎదిగాడు. 2018లో ఆసీస్‌ పర్యటనకు భారత జట్టు వెళ్లింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన టెస్టు మ్యాచులో 153.26 కి.మీ వేగంతో బుమ్రా బంతిని సంధించాడు. ఇదే టీమ్‌ ఇండియా తరఫున రెండో అత్యధికం.

* మహమ్మద్ షమీ : టీమ్‌ఇండియా నమ్మదగ్గ బౌలర్లలో షమీ ఒకడు. నిలకడగా బౌలింగ్ చేస్తూ వికెట్లను తీసే సత్తా షమీ సొంతం. కీలక సమయాల్లో ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తాడు. అలాంటి షమీ 2014లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 153.2 కి.మీ వేగంతో బంతిని సంధించాడు. 

* ఉమ్రాన్‌ మాలిక్‌, సైని : భారత యువ బౌలర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, నవ్‌దీప్‌ సైని కూడానూ వేగవంతమైన బంతులను సంధించారు. అయితే టీమ్‌ఇండియా తరఫున కాకుండా ఐపీఎల్‌లో కావడం గమనార్హం. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఆడుతున్న ఉమ్రాన్‌ మాలిక్‌ గతేడాది (2021) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుపై జరిగిన మ్యాచ్‌లో 153 కి.మీ వేగంతో బంతిని సంధించి ఔరా అనిపించాడు. ఉమ్రాన్‌ ఇంకా టీమ్‌ఇండియా జట్టులోకి అరంగేట్రం చేయలేదు. నవ్‌దీప్‌ సైని ఐపీఎల్‌ 2019 ఎడిషన్‌లో 152.85 కి.మీ వేగంతో బంతిని విసిరాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని