WTC Final:  కోహ్లీసేనకు కివీస్‌ కోచ్‌ సలహాలు!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య పోటీ సమానంగా ఉంటుందని కివీస్‌ కోచ్‌ మైక్ హెసన్‌ అన్నాడు. ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. ఐదుగురు బౌలర్లను ఆడిస్తే అశ్విన్‌, జడేజా ఇద్దరికీ చోటివ్వాలని అంటున్నాడు. ..

Published : 10 Jun 2021 01:33 IST

మయాంక్‌ను ఆడిస్తే మంచిదన్న హెసన్‌

దిల్లీ: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య పోటీ సమానంగా ఉంటుందని కివీస్‌ కోచ్‌ మైక్ హెసన్‌ అన్నాడు. ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. ఐదుగురు బౌలర్లను ఆడిస్తే అశ్విన్‌, జడేజా ఇద్దరికీ చోటివ్వాలని అంటున్నాడు. ఆస్ట్రేలియా తరహాలో రిషభ్ పంత్‌ ఫైనల్లో కీలకమవుతాడని పేర్కొన్నాడు. కాగా నాలుగు రోజుల అంతరంతో మూడు టెస్టులను వరుసగా ఆడటం తమ ఆటగాళ్లకు భారమేనని తెలిపాడు. పని భారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుందని వెల్లడించాడు.

‘నాలుగు రోజుల అంతరంతో మూడు టెస్టులు ఆడటం సమస్యే. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ దాడిని పర్యవేక్షించుకోవాలి. అందుకే ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ట్రెంట్‌బౌల్ట్‌ను తీసుకుంటున్నాం. ఈ నిర్ణయంతో మరొకరికి విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే రెండో టెస్టులో 45-50 ఓవర్లు వేస్తే పనిభారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ద్విశతక వీరుడు డేవాన్‌ కాన్వే అద్భుతమైన ఆటగాడు. టెస్టు క్రికెట్‌కు ఎప్పుడు అర్హత సాధిస్తాడా అని ఎదురుచూశాం. టామ్‌ బ్లండెల్‌కు చోటివ్వకపోవడం కఠిన నిర్ణయమే. కానీ కాన్వే కోసం తప్పదు’ అని హెసన్‌ అన్నాడు.

టీమ్‌ఇండియా జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపిక గురించీ హెసన్‌ సలహాలు ఇవ్వడం గమనార్హం. ‘బహుశా రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌తో ఓపెనింగ్‌ చేయించాలని కోహ్లీసేన భావిస్తుండొచ్చు. మయాంక్‌ను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది. న్యూజిలాండ్‌లో అతడు కివీస్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మిగతావాళ్ల కన్నా ఎక్కువ పరుగులు చేశాడు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు’ అని హెసన్‌ తెలిపాడు.

‘ప్రతి మైదానం భిన్నంగానే ఉంటుంది కాబట్టి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ముఖ్యం. అయితే భారత్‌కు ఏ మైదానంలోనైనా ఆడగల వనరులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో మనం దీనిని గమనించాం. న్యూజిలాండ్‌ ముందుగా రెండు టెస్టులాడినా ఫైనల్లో పోటీ మాత్రం నువ్వానేనా అన్నట్టే ఉంటుంది. రెండు జట్ల ఓపెనర్లు స్వింగయ్యే బంతుల్ని ఎలా ఎదుర్కొంటారన్నది కీలకం. ఏ జట్టు టాప్‌ ఆర్డర్‌ ఎక్కువ పరుగులు చేస్తే వారికి అవకాశాలు ఉంటాయి’ అని హెసన్‌ పేర్కొన్నాడు.

‘డ్యూక్‌ బంతులతో స్పిన్నర్లూ రాణించగలరు. జడ్డూ, అశ్విన్‌ ఉండటంతో టీమ్‌ఇండియాకు ఎక్కువ సమతూకం లభిస్తోంది. ఐదుగురు బౌలర్లను ఎంచుకొంటే ఈ ఇద్దరు స్పిన్నర్లకూ చోటివ్వాలి. ఎందుకంటే కివీస్‌లో ఐదుగురు ఎడమచేతి, ఆరుగురు కుడిచేతి వాటం ఆటగాళ్లు ఉన్నారు. పంత్‌ ఫైనల్లో కీలకమవుతాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడి ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. మరింత కుదురుకున్నాడు. స్వేచ్ఛగా ఆడతాడు. జట్టులోనూ ఘనత అందుకున్నాడు’ అని హెసన్‌ వెల్లడించారు. ఇక టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నట్టుగా.. టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే మూడు మ్యాచులు నిర్వహించాలని సూచించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని