wtc final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు రెండు పిచ్‌లు సిద్ధం.. ఎందుకంటే..!

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఐసీసీ రెండు పిచ్‌లను సిద్ధం చేసిందన్న వార్తలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రధాన పిచ్‌కు ఆందోళనకారుల నుంచి ముప్పు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం.  

Updated : 07 Jun 2023 13:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ మొదలు కావడానికి మరికొన్ని గంటల మాత్రమే మిగిలున్న సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొన్నాయి. భారత్‌-ఆసీస్‌ మధ్య జరగనున్న తుదిపోరు కోసం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఏకంగా రెండు పిచ్‌లను సిద్ధం చేసింది. ఐసీసీ నిర్ణయం అభిమానులను గందరగోళానికి గురిచేసింది. వాస్తవానికి దీనికో కారణం ఉంది. చమురుధరల పెంపుపై ఇంగ్లాండ్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ పిచ్‌ను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. దీంతో ఫైనల్స్‌కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని కెన్నింగ్టన్‌ ఓవల్‌ క్రికెట్‌ మైదానానికి భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాదు ఐసీసీ నిబంధన 6.4లో మార్పులు చేసి ప్రత్యామ్నాయ పిచ్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.

  • ఒక వేళ ప్రధాన పిచ్‌పై ఆందోళనకారులు దాడి చేస్తే.. అది ఆడటానికి పనికి వస్తుందో లేదో అంచనా వేస్తారు. ఒక వేళ పిచ్‌ కండిషన్‌ ఆడటానికి అనువుగా లేకపోతే ప్రత్యామ్నాయ పిచ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకొంటారు. రెండో పిచ్‌ ఆప్షన్‌గా మాత్రమే ఉంటుంది. దానిపై ఆడవచ్చు.. ఆడకపోవచ్చు.  
  • పిచ్‌ దెబ్బతిన్న సమయంలో ఇరు జట్ల కెప్టెన్లయిన రోహిత్‌, కమిన్స్‌ నిర్ణయం ఆధారంగా ఆటను కొనసాగించడమా..?లేదా రద్దు చేయడమా? అనేది నిర్ణయిస్తారు. ఈ క్రమంలో కొన్ని విభాగాలు కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది.
  • తొలుత మైదానంలోని అంపైర్‌ సదరు పిచ్‌పై ఆటను కొనసాగించడం సురక్షితం/సహేతుకం కాదని నిర్ణయిస్తే.. వెంటనే మ్యాచ్‌ను నిలిపివేస్తారు. 6.4.1 నిబంధన ప్రకారం ఐసీసీ మ్యాచ్‌ రిఫరీకి సమాచారం అందజేస్తారు.
  • ఇక 6.4.4 నిబంధన ప్రకారం మైదానంలోని అంపైర్లు.. వాతావరణం, పిచ్‌ ఆడటానికి అనుకూలంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. ప్రస్తుతం ఉన్న పిచ్‌కు మరమ్మతులు చేసి మ్యాచ్‌ను పునరుద్ధరించే విషయమై ఐసీసీ రిఫరీతో చర్చిస్తారు. మరమ్మతుల కారణంగా ఓ జట్టుకు లాభం ఉందా అన్న విషయాన్ని ఈ సమయంలో రిఫరీ జాగ్రత్తగా పరిశీలిస్తారు.
  • 6.4.7 నిబంధన ప్రకారం నిర్ణయంపై కసరత్తు జరిగే సమయంలో ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ.. ఇరు జట్ల కెప్టెన్లు, గ్రౌండ్‌ అథారిటీకి పరిస్థితిని వివరిస్తారు. ఈ క్రమంలో గ్రౌండ్‌ అథారిటీ హెడ్‌ సమయానుసారం పరిస్థితిపై పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ చేస్తుంటారు.
  • నేడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలుకానుంది. మ్యాచ్‌ జూన్‌ 11వ తేదీ వరకు జరగనుంది. అనుకోని పరిస్థితి ఎదురైతే వాడుకొనేలా రిజర్వ్‌డేను కూడా ఇప్పటికే ప్రకటించారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు