Virat Kohli: విరాట్‌ను అడ్డుకోవడం అంత సులువేం కాదు: ఆసీస్‌ ఆల్‌రౌండర్‌

ఆసీస్‌పై మంచి రికార్డు కలిగిన విరాట్ కోహ్లీని (Virat Kohli) అడ్డుకోవడం తమకు కాస్త కష్టమేనని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ వ్యాఖ్యానించాడు. కీలక మ్యాచుల్లో ముందుకు వచ్చి మరీ ఆడతాడని పేర్కొన్నాడు.

Published : 04 Jun 2023 12:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో (WTC Final 2023) ఇప్పుడంతా విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా ఆటపైనే చర్చ. ఆస్ట్రేలియాపై అత్యుత్తమ రికార్డు కలిగిన వీరిద్దరూ రాణిస్తే  భారత్‌ విజయావకాశాలు మెండుగా ఉంటాయి. ఐపీఎల్‌లోనూ నాణ్యమైన ప్రదర్శనతో ఇంగ్లాండ్‌లోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ సాధన షురూ చేశాడు. ఈ క్రమంలో విరాట్ ఆటతీరుపై ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తమ జట్టుపై ఉత్తమ ప్రదర్శన చేసే విరాట్.. భారీ మ్యాచుల్లో ఇంకా దూకుడుగా ఆడతాడని గ్రీన్ పేర్కొన్నాడు. జట్టులో నైతిక స్థైర్యం నింపేలా ముందుడుగు వేస్తాడని తెలిపాడు. 

‘‘కీలక సమయంలో ముందుకు వచ్చే అతికొద్ది బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టోర్నీనే అద్భుతమైంది. ఇందులో మేం ఫైనల్‌కు చేరుకోవడం మరింత ఆనందంగా ఉంది. తప్పకుండా విజయం కోసం ప్రయత్నిస్తాం. భారత బ్యాటర్లను అడ్డుకునేందుకు తగిన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. టెస్టు క్రికెట్‌కు మించిందేమీ లేదు. దాదాపు రెండు నెలలపాటు టీ20 క్రికెట్‌ ఆడా. ఇప్పుడు నా ముందున్న అతిపెద్ద సవాల్‌ ఇదే. పొట్టి ఫార్మాట్‌ నుంచి టెస్టుల్లోకి త్వరగా మారిపోవాలి. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. అత్యుత్తమ ఆటగాళ్లతో కలిసి ఆడబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని కామెరూన్ గ్రీన్‌ తెలిపాడు. 

వార్నర్ పుంజుకుంటాడు: ఉస్మాన్‌

భారత్‌తో జరిగిన బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన డేవిడ్‌ వార్నర్‌ ఈసారి తప్పకుండా పుంజుకుంటాడని ఆసీస్‌ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా వ్యాఖ్యానించాడు. గతేడాది తన 100వ టెస్టులో డబుల్ సెంచరీ కొట్టి మరీ అదరగొట్టిన విషయాన్ని మరిచిపోలేమని పేర్కొన్నాడు. ‘‘గత కొన్ని రోజులుగా అతడి బ్యాటింగ్‌ను గమనిస్తున్నా. ప్రాక్టీస్‌ చేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. తప్పకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో రాణిస్తాడు’’ అని ఉస్మాన్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని