Pak Cricket: భారత్‌ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్‌ సూచన

ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా.. మెగా టోర్నీల్లో చిత్తవకుండా ఉండేందుకు టీమ్ఇండియా (Team India) ఆటగాళ్లను రొటేషన్‌ పద్ధతిలో ఆడిస్తోంది. అంతేకాకుండా రోహిత్ శర్మను కాకుండా.. ఇటీవల ఎక్కువగా టీ20ల్లో హార్దిక్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించింది. ఇలా వేర్వేరుగా జట్లను సిద్ధం చేసింది. ఇదే నమూనాను పాక్‌ కూడా చేయాలని పలువురు సూచించారు. కానీ ఆ జట్టు మాజీ ఆటగాడు మాత్రం  అలా కాదంటూ స్పందించాడు.

Published : 30 Jan 2023 19:46 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లు.. రెండు జట్లు.. ఇదీ టీమ్‌ఇండియా మోడల్‌. రోహిత్ శర్మ నాయకత్వంలో వన్టేలు, టెస్టులను ఆడే భారత్‌.. హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీలో టీ20లు ఆడుతోంది. ‘మిషన్ 2024’లో భాగంగా పాండ్యకు నాయకత్వ బాధ్యతలను మేనేజ్‌మెంట్‌ అప్పగించింది. భారత్‌ మోడల్‌ను అంతర్జాతీయంగా పలువురు మాజీ క్రికెటర్లు అభినందించారు. మరికొందరేమో అలా మార్పులు చేసుకుంటూ పోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే నమూనాను దాయాది దేశం పాకిస్థాన్‌ కూడా అవలంబించాలని ఆ జట్టు మాజీలు సూచించారు. అయితే పాక్‌ మాజీ వికెట్‌ కీపర్ కమ్రాన్‌ అక్మల్‌ మాత్రం విభిన్నంగా స్పందించాడు. టీమ్‌ఇండియాను అభినందిస్తూనే పాక్‌ జట్టుకు చురకలు అంటించాడు. 

‘‘ ఫస్ట్‌, మీరు మొదటి జట్టునే సరిగ్గా తయారు చేయండి.  ఇలా దేశవాళీ క్రికెట్‌లో రెండు, మూడు టీమ్‌లను 2018-19 ముందు కూడా తయారు చేశారు. పాక్‌లో డొమిస్టిక్‌ క్రికెట్‌ చాలా సంపన్నమైంది. నేను చాలా ఏళ్లు ఆడాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఒక జట్టును తయారు చేయడమే పాక్‌ మేనేజ్‌మెంట్‌కు గగనంగా మారింది. ఆరు జట్లతో ప్రయోజనం ఉండి ఉంటే ఫవాద్‌ ఆలం చాలా సంవత్సరాల తర్వాత పునరాగమనం చేసేవాడే కాదు’’ అని కమ్రాన్ వ్యాఖ్యానించాడు. 

పాక్‌ను గతేడాది ఆసియా కప్‌‌, టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో ఆ జట్టు సారథి బాబర్‌ అజామ్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల వరుసగా స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో ఘోర ఓటమితో తీవ్రంగా విమర్శలపాలయ్యాడు. గత సీజన్‌లో మొత్తం 8 టెస్టులను ఆడిన పాక్‌.. నాలుగింట్లో ఓడిపోయి, మరో నాలుగింటిని డ్రాగా చేసుకొంది. కనీసం ఒక్క మ్యాచ్‌ను గెలవలేక చతికిల పడిపోయింది. దీంతో బాబర్‌ అజామ్‌ కెప్టెన్సీపై వేటు వేయాలని, జట్టులో సమూల మార్పులు చేయాలనే డిమాండ్లు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని