IND vs AUS: అహ్మదాబాద్‌ టెస్టులో వారిద్దరినీ ఆడించాలి: రికీ పాంటింగ్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లేందుకు భారత్‌కు (Team India) కీలకమైన మ్యాచ్‌ ఇది. అయితే, తుది జట్టుపై టీమ్‌ఇండియా తర్జనభర్జనలు పడుతోంది. 

Updated : 07 Mar 2023 11:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్ - ఆస్ట్రేలియా(IND vs AUS) జట్ల మధ్య మార్చి 9 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాలంటే టీమ్‌ఇండియా (Team India)కు ఇది చాలా కీలకం. అయితే, జట్టు కూర్పుపై మాత్రం భారత మేనేజ్‌మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. తొలి రెండుటెస్టుల్లో విఫలమైన కేఎల్ రాహుల్‌ను తప్పించి యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం కల్పించింది. కానీ, మూడో టెస్టులో గిల్‌ నిరాశపరిచాడు. ఈ క్రమంలో కీలకమైన నాలుగో మ్యాచ్‌కు వీరిద్దరిలో ఎవరిని తీసుకోవాలి...? లేకపోతే మిడిల్‌లో దూకుడుగా ఆడే బ్యాటర్‌ లేకపోవడం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి సూర్యకుమార్‌ వైపు మొగ్గు  చూపే అవకాశం ఉందా..? అనేది తెలియాలంటే వేచి చూడాలి. అయితే, నాలుగో టెస్టు మ్యాచ్‌కు తుది జట్టులో వీరిద్దరినీ తీసుకోవాలని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ చెప్పాడు.

‘‘మూడో టెస్టులో కేఎల్ రాహుల్‌  స్థానంలో శుభ్‌మన్ గిల్‌ వచ్చాడు. కానీ, గిల్‌ ఆకట్టుకోలేకపోయాడు. అయితే, నాలుగో టెస్టులో ఇద్దరినీ ఆడించేందుకు అవకాశం ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ను ఓపెనింగ్‌కు పంపి.. కేఎల్‌ను మిడిలార్డర్‌లో ఆడించొచ్చు. ఇంతకుముందు కూడా రాహుల్‌ ఇదే స్థానంలో టెస్టు క్రికెట్‌ ఆడాడు. WTC Final జరిగే యూకేలోని పిచ్‌ పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతూనే ఉంటుంది. భారత్‌, ఆసీస్‌ జట్లు అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతాయని అనుకుంటున్నా. ఇది కేవలం టెస్టు మ్యాచ్‌ మాత్రమే కాదు.. ఇరు జట్లకూ చాలా కీలకం’’అని పాంటింగ్‌ తెలిపాడు. వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి ఊపుమీదున్న భారత్‌కు మూడో మ్యాచ్‌లో షాక్‌ తగిలింది. అనూహ్యంగా ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని