పృథ్వీషా కొడితే.. రికార్డు బద్దలే! 

టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, ముంబయి సారథి పృథ్వీషా దేశవాళి క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. విజయ్‌ హజారె ట్రోఫీలో ఒకే సీజన్‌లో 800కు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు...

Published : 15 Mar 2021 01:28 IST

విజయ్‌ హజారె ట్రోఫీలో అరుదైన ఘనత..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, ముంబయి సారథి పృథ్వీషా దేశవాళి క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. విజయ్‌ హజారె ట్రోఫీలో ఒకే సీజన్‌లో 800కు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఆదివారం ఉత్తర్‌ ప్రదేశ్‌తో జరిగిన ఫైనల్లో 313 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పృథ్వీ(73; 39 బంతుల్లో 10x4, 4x6) ధాటిగా ఆడుతూ ఔటయ్యాడు. ఈ క్రమంలోనే అతడు ఒకే సీజన్‌లో 827 పరుగుల అత్యధిక స్కోర్‌ సాధించాడు.

2018లో కర్ణాటక తరఫున మయాంక్‌ అగర్వాల్‌ సాధించిన 723 పరుగులే ఇదివరకు ఈ ట్రోఫీలో అత్యధిక స్కోర్‌గా నమోదైంది. ఈ సీజన్‌లో దాన్ని ఇద్దరు ఆటగాళ్లు అధిగమించి కొత్త రికార్డులు సృష్టించారు. వారే ముంబయి కెప్టెన్‌ పృథ్వీ(825), కర్ణాటక బ్యాట్స్‌మన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌(725). కాగా, ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత టీమ్‌ఇండియా.. పృథ్వీని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. దాంతో అతడు స్వదేశానికి తిరిగొచ్చాక తన వైఫల్యాలపై దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలోనే విజయ్‌ హజారె ట్రోఫీలో పట్టుదలగా బ్యాటింగ్‌ చేసి మూడు సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ బాదాడు.

మరోవైపు ఇప్పుడు అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 312 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు మాధవ్‌ కౌషిక్‌(158*; 156 బంతుల్లో 15x4, 4x6), సామ్రాట్‌ సింగ్‌(55; 73 బంతుల్లో 4x4, 3x6) ధాటిగా ఆడగా, తర్వాత ప్రియమ్‌గార్గ్‌(21), అక్ష్‌దీప్‌నాథ్‌(55) తమ వంతు పరుగులు చేశారు. దాంతో ముంబయి ముందు 313 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఈ క్రమంలోనే పృథ్వీ మరోసారి ధాటిగా ఆడి ముంబయికి శుభారంభం చేశాడు. ఆపై ఆదిత్య తారె(118; 107 బంతుల్లో 18x4), శివమ్‌దూబె(42; 28 బంతుల్లో 6x4, 1x6) చెలరేగి 41.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని