Olympic Contingent: దేశాన్ని గర్వపడేలా చేశారు.. క్రీడాకారులకు రాష్ట్రపతి తేనీటి విందు

టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను శనివారం రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించిన ఆయన వారికి అభినందనలు తెలిపారు....

Updated : 14 Aug 2021 22:03 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను శనివారం రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించిన ఆయన వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఒలింపిక్‌ అథ్లెట్లను చూసి దేశం గర్వపడుతోందని పేర్కొన్నారు. భారత ఒలింపిక్స్‌ చరిత్రలో ఈసారి అత్యధిక పతకాలు అందించారని వారిని ప్రశంసించారు. మహిళా క్రీడాకారులపై అభినందనలు కురిపించారు. ‘ఈ విపత్కర పరిస్థితుల్లోనూ భారతావని సంబురాలు చేసుకునేలా చేశారు. ఎన్నో ఒడిదొడకులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి ప్రదర్శన చేశారు. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ప్రతిసారీ కొత్త విషయాలను నేర్చుకొంటాం’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఆయనతోపాటు క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, క్రీడాశాఖ మాజీ మంత్రి కిరణ్‌ రిజుజుతోపాటు పలువులు మంత్రులు పాల్గొన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులను దిల్లీలోని ఎర్రకోట వేదికగా నిర్వహించబోయే స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. వీరితోపాటు వారి కోచ్‌లు, సపోర్ట్‌ స్టాఫ్‌, సాయ్‌, క్రీడా సమాఖ్య అధికారులను కూడా ఆహ్వానించారు. క్రీడాకారులందరినీ మోదీ వ్యక్తిగతంగా కలసి మాట్లాడనున్నట్టు అధికారులు తెలిపారు.

భారత ఒలింపిక్స్‌ చరిత్రలోనే భారత్‌ ఈసారి అత్యధికంగా ఏడు పతకాలు సాధించింది. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాభాయి చాను, రెజ్లింగ్‌లో రవికుమార్‌ దహియా రజతం గెలుపొందారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, బాక్సింగ్‌లో లవ్లీనా, రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా కాంస్య పతకాలు సాధించారు. భారత పురుషుల హాకీ జట్టు సైతం కాంస్యంతో మెరిసింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని