IPL 2021: ఐపీఎల్‌లో చెత్త రికార్డు.. వరుసగా ఏడోసారి పంజాబ్‌

ఐపీఎల్‌ 2021లో పేలవ ప్రదర్శన చేసిన పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఈ సారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు మాత్రమే సాధించి

Published : 10 Oct 2021 01:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 2021లో పేలవ ప్రదర్శన చేసిన పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఈ సారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు మాత్రమే సాధించి ఆరో స్థానానికే పరిమితమైంది. దీంతో వరుసగా ఏడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు వెళ్లని ఏకైక జట్టుగా నిలిచి ఈ మెగా టోర్నీలో చెత్త రికార్డును తమ పేరున నమోదు చేసుకుంది. 

2008లో ఐపీఎల్‌ ప్రారంభమైన తొలి సీజన్‌లో పంజాబ్‌ తొలిసారి సెమీఫైనల్‌ వరకు వెళ్లింది. అయితే ఆ తర్వాత వరుసగా ఐదు సీజన్లలో జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఆ తర్వాత బలంగా పుంజుకున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు 2014లో ఏకంగా ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో తృటిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్‌ జట్టులో పంజాబ్‌ జట్టుకు చెప్పుకోదగ్గ చరిత్ర ఇదే. 

2015 నుంచి ఆ జట్టు అభిమానులను నిరాశ పరుస్తూనే ఉంది. అప్పటి నుంచి వరుసగా ఏడు సీజన్లలో లీగ్‌ దశ నుంచే పంజాబ్‌ నిష్క్రమించి ఐపీఎల్‌లో చెత్త రికార్డు నెలకొల్పింది. అంతకుముందు దిల్లీ జట్టు కూడా 2013 నుంచి 2018 వరకు ఇలాంటి పేలవ ప్రదర్శనే సాగించి వరుసగా ఆరు సీజన్లు ప్లేఆఫ్‌కు చేరుకోలేదు. ఇప్పుడు ఆ రికార్డును పంజాబ్‌ దాటేసింది. 

అయితే గత మూడేళ్లుగా దిల్లీ బలంగా పుంజుకుంది. 2019, 2020 సీజన్లలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన దిల్లీ జట్టు.. ఈ సారి పాయింట్ల పట్టికలో 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌ టోర్నీలో ఇప్పటివరకూ పంజాబ్‌, బెంగళూరు, దిల్లీ జట్లు ఒక్కసారి కూడా కప్పు అందుకోలేదు. అయితే ఈ సారి దిల్లీ, బెంగళూరు జట్లు ప్లేఆఫ్‌కు చేరుకుని టైటిల్‌ కోసం పోటీలో ఉండగా.. పంజాబ్‌ మాత్రం ఎప్పటిలాగే ఈ సారి కూడా లీగ్ నుంచి ఇంటిదారి పట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని