CSK Vs PBKS: చెన్నైపై పంజాబ్‌ అలవోక విజయం

పంజాబ్‌ కింగ్స్‌ మెరిసింది. బలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీఎస్కే నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని 13 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్‌ కేఎల్ రాహుల్ ( 98; 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు

Updated : 07 Oct 2021 19:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-2021లో పంజాబ్‌ కింగ్స్‌ మెరిసింది. బలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపై 6 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. సీఎస్కే నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్‌ కేఎల్ రాహుల్ ( 98; 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో ఆ జట్టుకు సునాయాస విజయం లభించింది.

చెన్నై నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పంజాబ్‌కు ఐదో ఓవర్‌లో తొలి ఎదురుదెబ్బ తగిలింది.  శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఐదో ఓవర్‌లో పంజాబ్‌ కింగ్స్‌ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మూడో  బంతికి మయాంక్‌ అగర్వాల్‌ (12) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. చివరి బంతికి సర్ఫారాజ్‌ ఖాన్‌ డకౌటయ్యాడు. దీపక్ చాహర్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో చివరి బంతికి షారూక్‌ ఖాన్‌(8) బ్రావోకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఠాకూర్‌ వేసిన 12.1 బంతికి మార్‌క్రమ్‌ (13) ధోనీకి చిక్కాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఛేదించాల్సిన లక్ష్యం తక్కువగా ఉండడం, అప్పటికే కేఎల్‌ రాహుల్‌ దూకుడు మీద ఉండడంతో పంజాబ్‌ విజయాన్ని చెన్నై బౌలర్లు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. దీంతో పంజాబ్‌ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ మూడు, దీపక్‌ చాహర్‌ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 6 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. డుప్లెసిస్‌ (76; 55 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి వరుస షాక్‌లు తగిలాయి. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన 3.5 బంతికి గైక్వాడ్.. షారూక్‌ఖాన్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటవగా.. తర్వాత వచ్చిన మొయిన్‌ అలీ డకౌటయ్యాడు. రాబిన్‌ ఉతప్ప (2), అంబటి రాయుడు(4)లను జోర్డాన్‌ వరుస ఓవర్లలో ఔట్‌ చేసి చెన్నైకి గట్టి షాక్ ఇచ్చాడు. కుదురుకుంటున్నట్లు కనిపించిన ధోనీ (12)ని 12వ ఓవర్లో రవి బిష్ణోయ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. జడేజా (15) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌, జోర్డాన్‌ రెండు, రవి బిష్ణోయ్‌, షమి తలో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని