Dinesh Karthik: దినేశ్‌ కార్తీక్‌ను అడ్డుకునేందుకు రాజస్థాన్‌ ప్రణాళిక ఇదే!

ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా బంతిని బౌండరీలకు తరలించడమే పనిగా పెట్టుకున్నాడు...

Published : 26 Apr 2022 15:30 IST

(Photo: Dinesh Karthik Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా బంతిని బౌండరీలకు తరలించడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో స్టేడియం నలుమూలలా దంచికొడుతూ బెంగళూరుకు విలువైన పరుగులు అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి పరుగుల ప్రవాహాన్ని అడ్డుకునే విషయంపై ప్రత్యర్థి జట్లు తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈరోజు సాయంత్రం రాజస్థాన్‌ పుణె వేదికగా బెంగళూరుతో తలపడనుంది. ఈ సందర్భంగా కార్తీక్‌ను అడ్డుకునేందుకు రాజస్థాన్‌ సోషల్‌ మీడియా టీమ్‌ ఓ ఉపాయం ఆలోచించింది.

అదేంటంటే.. ముంబయి-పుణె హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఉందని, అలాంటప్పుడు ఆ రూట్‌లో కాకుండా మరో షార్ట్‌కట్‌ రూట్‌లో దినేశ్‌ కార్తీక్‌ ముంబయి నుంచి పుణె చేరుకోవాలని ఓ రూట్‌ మ్యాప్‌కు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. దాంట్లో ముంబయి నుంచి దేశంలోని పలు ప్రాంతాలను చుట్టేస్తూ చివరికి పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియానికి రావాలని కోరింది. ఆ రూట్‌ మ్యాప్‌లో పలు రాష్ట్రాల చుట్టూ తిరిగి రావడం గమనార్హం. అంటే రాజస్థాన్‌ సరదాగా డీకేను మ్యాచ్‌ ఆలస్యంగా రప్పిస్తే ఈరోజు తాము బెంగళూరును కట్టడి చేయొచ్చని సరదాగా పోస్టు చేసింది. దీనికి నెటిజన్లు, అభిమానుల నుంచి కూడా అదే రీతిలో స్పందన వచ్చింది.

రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ కూడా అలాగే రావాలంటూ ఓ అభిమాని చమత్కారంగా స్పందించాడు. మరికొందరు ఫన్నీ మీమ్స్‌తో అలరించారు. ఇంకొందరైతే దినేశ్‌ కార్తీక్‌ బ్యాటింగ్‌ చూసి రాజస్థాన్‌ భయపడుతోందని కూడా అంటున్నారు. మీరూ ఆ పోస్టు చూసి కాసేపు సరదాగా నవ్వుకోండి.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని