IND vs AUS: ఇక్కడ రోహిత్ శర్మ నేర్చుకొనేందుకు అవకాశాలు పుష్కలం: రవిశాస్త్రి

బ్యాటర్లకు అనుకూలంగా మారిన అహ్మదాబాద్ పిచ్‌  (IND vs AUS) నుంచి వికెట్లను తీయడం అంత సులువైన విషయం కాదని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 

Published : 11 Mar 2023 01:42 IST

ఇంటర్నెట్  డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) తొలి మూడు టెస్టులు కేవలం మూడు రోజుల్లోనే ముగిశాయి. అయితే నాలుగో టెస్టు జరుగుతున్న అహ్మదాబాద్‌ పిచ్‌ మాత్రం బ్యాటర్లకు అనుకూలంగా ఉంది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (180)తోపాటు కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలు సాధించారు. ఈ క్రమంలో ఆసీస్‌ వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ బౌలర్లను మారుస్తూ ఫలితం రాబట్టినా.. ఇద్దరు బ్యాటర్లు శతకాలు సాధించడంతో ఆసీస్‌ ముందంజలో నిలిచింది. అయితే, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో జట్టును నడిపించడం సవాల్‌తో కూడుకున్నదేనని, మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి రోహిత్‌కు ఇదొక సదావకాశమని టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. 

‘‘నాలుగో టెస్టు మ్యాచ్‌ రోహిత్ శర్మ నేర్చుకోవడానికి మంచి అవకాశం. టెస్టులు త్వరగా ముగుస్తున్న తరుణంలో..  అహ్మదాబాద్‌ పిచ్‌ మంచిదే. వికెట్లు అనుకున్నంత వేగంగా పడటం లేదు. ఇలాంటప్పుడే వనరులను సరైన పద్ధతిలో వినియోగించుకోవాల్సి ఉంటుంది. మంచి పిచ్‌ మీద విదేశాల్లోనూ, స్వదేశంలోనూ కెప్టెన్సీ నిర్వహించడం సవాల్‌తో కూడుకున్నదే. రోహిత్‌ శర్మలో అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. కానీ, వాటిని అవసరమైన సందర్భంలో వాడాలి. టెస్టులో ఏదైనా మంచి భాగస్వామ్యం నమోదు అవుతున్నప్పుడు.. విడగొట్టడానికి తగిన ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోవాలి’’ అని రవిశాస్త్రి చెప్పాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్‌ కూడా తన మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (17*), శుభ్‌మన్‌ గిల్ (18*) ఉన్నారు. ఇంకా 444 పరుగులను భారత్‌ వెనుకబడి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని