Dhoni - Jaddu: మహీ భాయ్‌.. కేవలం నీ కోసమే: వైరల్‌గా మారిన జడ్డూ పోస్టు

చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) టైటిల్‌ నెగ్గడంలో ధోనీ (MS Dhoni) వ్యూహాలు ఎంత కీలకమో.. రవీంద్ర జడేజా ప్రదర్శనా అంతే ముఖ్య పాత్ర పోషించింది. ఫైనల్‌లోనూ కీలకమైన సమయంలో బౌండరీలు కొట్టి సీఎస్‌కేను గెలిపించాడు.

Updated : 30 May 2023 12:33 IST

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐపీఎల్‌ 2023 సీజన్‌ (IPL 2023) టైటిల్‌ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs GT) అవతరించింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో సీఎస్‌కే ఐదోసారి కప్‌ను సొంతం చేసుకుంది. కీలక సమయంలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సిక్స్‌, ఫోర్‌ కొట్టి చెన్నైను గెలిపించాడు. ఎప్పుడూ తన భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఉండే ధోనీ తొలిసారి సంబరపడ్డాడు. ఈ క్రమంలో విన్నింగ్‌ షాట్‌ కొట్టిన రవీంద్ర జడేజానూ ఎత్తుకోవడం నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా జడ్డూ కూడా తన ట్విటర్ వేదికగా ధోనీని ఉద్దేశించి ప్రత్యేక పోస్టు పెట్టాడు. ‘‘ఇది కేవలం ఎంఎస్ ధోనీ కోసం మాత్రమే చేశాం. మహీ భాయ్‌ నీ కోసమే ఏదైనా..’’ అని జడ్డూ ట్వీట్ చేశాడు. సోమవారం అర్ధరాత్రి మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ఇదే విషయం గురించి జడ్డూ ప్రత్యేకంగా మాట్లాడాడు.

‘‘నా సొంత రాష్ట్రంలోని అభిమానుల మధ్య సీఎస్‌కే ఐదో టైటిల్‌ను గెలవడం అద్భుతంగా అనిపించింది. సీఎస్‌కేకు మద్దతుగా నిలవడానికి భారీగా తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. వర్షం తగ్గాలని రాత్రంతా వేచి చూశారు. సీఎస్‌కే అభిమానులకు శుభాకాంక్షలు చెబుతున్నా. ఈ అపూర్వ విజయాన్ని ఒకే ఒక వ్యక్తి కోసం అంకితం చేస్తున్నాం. మా కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ కోసమే గెలిచాం. మోహిత్ శర్మ చివరి ఓవర్‌లో చాలా స్లో బంతులను వేస్తాడని తెలుసు. స్ట్రెయిట్‌గా బంతిని కొడదామని ముందే అనుకున్నా. చివరికి ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది. సీఎస్‌కే అభిమానులు ఎల్లవేళలా ఇలాగే మద్దతు ఇస్తూ ఉండాలి. వారిని ఆనందింపజేయడానికి నిరంతరం మేం కృషి చేస్తాం’’ అని జడేజా పేర్కొన్నాడు. కేవలం ఆరు బంతుల్లోనే 15 పరుగులు చేసిన రవీంద్ర జడేజా సీఎస్‌కే టైటిల్‌ గెలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. అంతకుముందు బౌలింగ్‌లోనూ 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని