Ravindra Jadeja: ఎంటర్‌టైనర్‌కు వాన్‌ ఫిదా

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడనే విషయం తెలిసిందే. క్రికెట్‌ ఆడే సమయంలో తన ప్రాక్టీస్‌ సెషన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకునే అతడు...

Published : 17 May 2021 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడనే విషయం తెలిసిందే. క్రికెట్‌ ఆడే సమయంలో తన ప్రాక్టీస్‌ సెషన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకునే అతడు ఖాళీ సమయాల్లోనూ ఏం చేస్తుంటాడో అభిమానులకు తెలియజేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ ఫొటోలు పెట్టి అందర్నీ ఆకట్టుకుంటాడు. తాజాగా తనకు ఎంతో ఇష్టమైన గుర్రం ఫొటోలను పంచుకున్న జడ్డూ అది తన 22 ఎకరాల ఎంటర్‌టైనర్‌ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. దానికి ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైఖేల్‌ వాన్‌ ఫిదా అయిపోయి హృదయ ఆకారంతో మూడు ఎమోజీలను కామెంట్‌ సెక్షన్‌లో పోస్టు చేశాడు.

ఇదిలా ఉండగా, జడేజా ఇటీవలే టీమ్‌ఇండియా టెస్టు జట్టుకు మళ్లీ ఎంపికయ్యాడు. వచ్చేనెల ఇంగ్లాండ్‌లో న్యూజిలాండ్‌ జట్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఆ తర్వాత ఇంగ్లిష్‌ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యాడు. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన అతని చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దాంతో జడ్డూ కొద్ది నెలలు ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు సిరీసుల్లోనూ ఆడలేకపోయాడు. అనంతరం కోలుకొని ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడి మంచి ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 62 పరుగులు చేశాడు. హర్షల్‌ పటేల్ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో 5 సిక్సర్లు, ఒక బౌండరీతో మొత్తం 37 పరుగులు సాధించి ఔరా అనిపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని