SunRisers.. స్వయంకృతాపరాధం 

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ది ప్రత్యేక ప్రస్థానం. 2012లో డెక్కన్‌ ఛార్జర్స్‌ చోటు కోల్పోయాక సన్‌రైజర్స్‌ మరుసటి ఏడాది ఆ స్థానాన్ని భర్తీ చేసింది. వచ్చీ రాగానే ప్లేఆఫ్స్‌ చేరి అందరినీ ఆకట్టుకుంది...

Published : 04 May 2021 09:22 IST

వరుస ఓటములకు ఇవే కారణాలు..!

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ది ప్రత్యేక ప్రస్థానం. 2012లో డెక్కన్‌ ఛార్జర్స్‌ చోటు కోల్పోయాక సన్‌రైజర్స్‌ మరుసటి ఏడాది ఆ స్థానాన్ని భర్తీ చేసింది. వచ్చీ రాగానే ప్లేఆఫ్స్‌ చేరి అందరినీ ఆకట్టుకుంది. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో 2016లో తొలిసారి టైటిల్‌ సాధించి తెలుగు అభిమానులకు మరింత చేరువైంది. అక్కడి నుంచి ఏటా ప్లేఆఫ్స్‌ చేరుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో పేలవంగా ఆడుతోంది. ఇప్పటికే సగం సీజన్‌ పూర్తయినా ఒకే ఒక్క విజయంతో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ప్లేఆఫ్స్‌ చేరడం దాదాపు కష్టమే. అయితే, సన్‌రైజర్స్‌ ఇలా వైఫల్యం చెందడానికి పలు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.


నాలుగూ గెలవాల్సినవే..

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ 2 పాయింట్లతో అందరికన్నా చిట్ట చివరి స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. అయితే, ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడానికి ప్రధాన కారణం స్వయంకృతాపరాధమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు గెలవాల్సినవే. వాటి ఫలితాలు గమనిస్తే ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

* కోల్‌కతా 10: తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్‌ అద్భుతంగా పోరాడింది. ఓపెనర్లు సాహా(7), వార్నర్‌(3) విఫలమైనా మనీశ్‌ పాండే(61), జానీ బెయిర్‌స్టో(55) మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అయితే, కీలక సమయంలో వీరు ఔటవ్వడంతో పాటు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ధాటిగా ఆడలేక 10 పరుగుల తేడాతో తొలి ఓటమి చవిచూసింది.

* బెంగళూరు 6 : రెండో మ్యాచ్‌లో బెంగళూరు 149/8 స్కోర్‌ చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ అలవోకగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. సాహా(1) మరోసారి విఫలమయ్యాడు. కానీ, వార్నర్‌(54), మనీష్‌(38) ఆదుకున్నారు. వీరు ఔటయ్యాక మిగతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టడంతో హైదరాబాద్‌ 143/9తో సరిపెట్టుకొని ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

* ముంబయి 13 : ఈసారి ముంబయి 151 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఓపెనర్లు వార్నర్‌(36), బెయిర్‌స్టో(43) సగం స్కోర్‌ పూర్తి చేసిచ్చినా మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. మనీశ్‌ పాండే(2) తీవ్రంగా నిరాశపర్చాడు. మధ్యలో విజయ్‌ శంకర్‌(28) పోరాడిన అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ లేక 13 పరుగుల తేడాతో మరో పరాభవం ఎదుర్కొంది.

* దిల్లీ సూపర్‌: ఇక నాలుగో మ్యాచ్‌లో పంజాబ్‌పై 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్‌ ఐదో మ్యాచ్‌లో దిల్లీతో తలపడింది. అయితే, ఆ జట్టు నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 159/7 పరుగులే చేసింది. దాంతో ఇరు జట్లు స్కోర్లు సమం అయ్యాయి. కాగా, సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమైన వేళ కేన్‌ విలియమ్సన్‌(66*), జగదీశ సుచిత్‌(14*) ధాటిగా ఆడి 15 పరుగులు చేశారు. చివరి బంతికి 2 పరుగులు చేస్తే మ్యాచ్‌ గెలిచేదే. కానీ ఒకే పరుగు చేయడంతో సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. అక్కడ దిల్లీ విజయం సాధించింది.


ఆ నలుగురే..

ఈ పైన పేర్కొన్న అన్ని మ్యాచ్‌ల్లోనూ మొత్తంగా చూస్తే టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మాత్రమే పరుగులు చేశారు. ఓపెనర్లుగా ఆడే బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్‌ లేదంటే తర్వాత వచ్చే మనీశ్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌. మిగత మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ పూర్తిగా చేతులేత్తేశారు. సన్‌రైజర్స్‌ తరఫున బెయిర్‌స్టో ఏడు మ్యాచ్‌లాడి 41.33 సగటుతో 248 పరుగులు సాధించాడు. తర్వాత డేవిడ్‌ వార్నర్‌ 32.16, మనీశ్‌ పాండే 48.25 సగటులతో చెరో 193 పరుగులు చేశారు. ఆపై విలియమ్సన్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 128 అమోఘమైన సగటుతో 128 పరుగులు చేశాడు. వీరందరి తర్వాత విజయ్‌ శంకర్‌ 7 మ్యాచ్‌ల్లో 11.60 ఘోరమైన సగటుతో 58 పరుగులు చేశాడు. ఈ గణంకాలొక్కటే చాలు సన్‌రైజర్స్‌ మిడిల్‌ ఆర్డర్‌ ఎలా ఆడుతుందనే విషయం చెప్పడానికి.


అదే బెడిసికొట్టింది..

ఈ సీజన్‌లో ఏ జట్టూ చేయనన్ని ప్రయోగాలు సన్‌రైజర్స్‌ చేసింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మొత్తం 21 మంది ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. అయినా ఏ ప్రయోజనం లేకపోయింది.  మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో ఐదుసార్లు కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. దాంతో సరైన జట్టు కూర్పు లోపించిందని స్పష్టంగా తెలుస్తోంది. టాప్‌ఆర్డర్‌ మినహా లోయర్‌ ఆర్డర్‌లో ఎవరు ఏ మ్యాచ్‌లో ఉంటారో ఏ మ్యాచ్‌లో ఉండరో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. మొత్తంగా జట్టులో 25 మందిలో 21 మందిని ఇప్పటికే ఆడించింది. ఇక మిగిలిన ఆ నలుగురికి ఎప్పుడు అవకాశం ఇస్తుందో చూడాలి.


అది కూడా అంతంతే..

సన్‌రైజర్స్‌కు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ సమస్య ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. అది ఎప్పటినుంచో ఉన్నదే. అయితే, బలమైన టాప్‌ ఆర్డర్‌, మేటి బౌలింగ్ బృందం ఉన్నందున ఇన్ని రోజులూ ఆ లోటు పెద్దగా తెరపైకి రాలేదు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. రషీద్‌ మినహా మిగతా బౌలర్లు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. నటరాజన్‌, హోల్డర్‌ లాంటి ఆటగాళ్లు గాయాల నుంచి తప్పుకున్నారు. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్‌ పూర్తిగా తేలిపోతున్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో 9.10 ఎకానమీతో 3 వికెట్లే తీశాడు. రషీద్‌ఖాన్‌ ఒక్కడే ఏడు మ్యాచ్‌ల్లో 6.14 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఖలీల్‌ అహ్మద్‌ నాలుగు వికెట్లు తీయగా విజయ్ శంకర్‌, సిద్ధార్థ్‌ కౌల్‌ చెరో మూడు వికెట్లతో దిగువ స్థాయిలో కొనసాగుతున్నారు.

చివరిగా ఇప్పటికైనా హైదరాబాద్‌ ఈ సమస్యలపై దృష్టిసారించి రాణిస్తే బాగుంటుంది. ఇకపై జరగాల్సిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధిస్తూ ముందుకు సాగితే గతేడాది లాగా కనీసం ఆఖరి నిమిషంలోనైనా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలున్నాయి. అది కూడా ఇతర జట్లు ఓటమిపాలైతేనే. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా జట్లన్నీ సన్‌రైజర్స్‌ కన్నా ఏదో ఒక విషయంలో బలంగా కనిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో విలియమ్సన్‌ ఎలా నడిపిస్తాడో చూడాలి.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని