BCCI: సెలెక్టర్ల పదవి కోసం 50 మందికిపైగా దరఖాస్తు.. ముందు వరసలో వీరేనా..?

చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా.. 50 మందికిపైగా అప్లై చేశారు. వీరిని సీఏసీ ఇంటర్య్వూ చేసి ఎంపిక చేయనుంది.

Published : 29 Nov 2022 14:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బీసీసీఐ పురుష సీనియర్‌ జట్టు సెలెక్టర్ల పదవి కోసం దరఖాస్తు చేసుకొనే గడువు సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఐదు పోస్టుల కోసం దాదాపు 50 మందికిపైగా దరఖాస్తు చేసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్ మనిందర్‌ సింగ్‌, మాజీ ఓపెనర్ శివ్‌సుందర్ దాస్‌, వినోద్ కాంబ్లి ఉన్నారు. దరఖాస్తుదారుల్లో సుపరిచితమైన ఆటగాళ్లు వీరే..  ఇక మాజీ పేసర్‌ అజిత్‌ అగర్కార్‌ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అగర్కార్‌ దరఖాస్తు చేశాడో లేదో మాత్రం తెలియరాలేదు. 

ముంబయి జోన్‌ నుంచి కాంబ్లితోపాటు సీనియర్‌ ముంబయి జట్టు ప్రస్తుత ఛైర్మన్ సలీల్‌ అంకోలా, మాజీ వికెట్‌ కీపర్‌ సమిర్‌  దరఖాస్తు చేసుకొన్నారు. అయితే 50 మందిలో మనిందర్‌ సింగ్‌ (35 టెస్టులు, 59 వన్డేలు), ఎస్‌ఎస్‌ దాస్‌ (21 టెస్టులు, 4 వన్డేలు) మాత్రమే అందరికంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడటం గమనార్హం. తర్వాత వినోద్ కాంబ్లి (17 టెస్టులు, 104 వన్డేలు) ఉన్నాడు. మనిందర్‌ సింగ్‌ 2021లోనూ దరఖాస్తు చేసుకోగా.. ముఖాముఖిలో అర్హత సాధించలేకపోయాడు. మదన్‌లాల్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) చేతన్‌ శర్మ వైపు మొగ్గు చూపింది. చేతన్‌, మనిందర్‌ ఒకే కాలంలో క్రికెట్‌ ఆడిన ఆటగాళ్లు. ఈసారి సెలెక్టర్‌ పదవి కోసం దరఖాస్తు చేసినట్లు మనిందర్‌ ఖరారు చేశాడు. దక్షిణ జోన్‌ నుంచి హైదరాబాద్‌ మాజీ స్పిన్నర్‌ కున్వాల్‌జీత్‌ సింగ్‌ దరఖాస్తు చేశాడు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని