IND vs PAK: వన్డే ప్రపంచ కప్‌ 2023.. భారత్‌లో ఆడేది లేదన్న పాక్‌.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!

దాయాదుల పోరును చూడటమంటే క్రికెట్‌ అభిమానులకు పండగే. కానీ, ఈసారి ప్రపంచ కప్‌లో మాత్రం భారత్ - పాకిస్థాన్‌ తలపడతాయో లేదోననే మీమాంస కొనసాగుతోంది. పీసీబీ నిర్ణయం మాత్రం అడ్డకింగా మారే అవకాశం ఉంది.

Published : 31 Mar 2023 01:29 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈసారి వన్డే ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ను చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు లేనట్టేనా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే కష్టమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్, పాకిస్థాన్‌లో ఆసియా కప్‌ టోర్నమెంట్‌లు జరిగాల్సి ఉంది. అయితే, పాక్‌లో ఆసియా కప్‌ను నిర్వహిస్తే తమ జట్టు రాదని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తటస్థ వేదికలపైనే ఆడతామని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. దాంతో పాక్‌ కూడా తాము వన్డే ప్రపంచకప్‌లో ఆడేదిలేదని అప్పటి నుంచే చెబుతూ వస్తోంది. తాజాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పాక్‌ తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలిసింది. కాకపోతే ప్రపంచ కప్‌లో ఆడేందుకు   కొత్త షరతులను విధించడం గమనార్హం. 

ఆసియా కప్‌లో భారత్‌ తటస్థ వేదికలపైనే ఆడేందుకు మొగ్గు చూపినట్లే.. పాకిస్థాన్‌ కూడా వన్డే ప్రపంచకప్‌లో తాము ఆడాల్సిన మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌ లేదా శ్రీలంక దేశాల్లోని మైదానాల్లో నిర్వహించాలని షరతులను విధించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ - నవంబర్‌లో వన్డే ప్రపంచ కప్‌ జరగనుంది. అయితే, ఇప్పటి వరకు ఐసీసీ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను వెల్లడించలేదు. ఈ క్రమంలో కొత్త షరతులతో పాక్ క్రికెట్‌ బోర్డు ముందుకు రావడంపై ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే, ఐసీసీ, బీసీసీఐ మాత్రం దీనికి ఒప్పుకోవడం కష్టమేనని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

‘‘అవును.. ఒకవేళ బీసీసీఐ వారి జట్టును ఆసియా కప్‌ కోసం పాక్‌కు పంపించకపోతే.. మేం కూడా ప్రపంచకప్‌ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వెళ్లేది లేదు. మా మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికలపైనే నిర్వహించాలనేది మా షరతు’’ అని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఆసియా కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై తుది నిర్ణయం వెలువడితే మాత్రం ప్రపంచకప్‌ సమస్యకూ తెరపడే అవకాశం ఉంది. అయితే, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు భారత్‌కు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే భద్రతరీత్యా దాయాది దేశానికి వెళ్లేందుకు మాత్రం టీమ్‌ఇండియాకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని