WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఆసీస్‌ తుది జట్టులో అతనుంటే బెటర్: రికీ పాంటింగ్‌

మరో పది రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు టీమ్‌ఇండియా (Team India) సమాయత్తం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final 2023) మ్యాచ్‌లో ఆసీస్‌తో భారత్‌ తలపడనుంది. ఇప్పటికే రెండు బోర్డులూ తమ జట్లను ప్రకటించాయి.

Published : 27 May 2023 23:47 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆదివారంతో ఐపీఎల్ (IPL 2023) మెగా టోర్నీ ముగియనుంది. ఆ తర్వాత క్రికెట్ అభిమానుల కోసం మరో ఉత్కంఠ పోరు సిద్ధం కానుంది. జూన్ 7వ తేదీ నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC Final 2023) మ్యాచ్‌ జరగనుంది. ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానం వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) తలపడతాయి.  ఈ క్రమంలో డబ్ల్యూటీసీ విజేత ప్రైజ్‌మనీని ఇప్పటికే ఐసీసీ ప్రకటించింది. ఇరు జట్లూ తమ స్క్వాడ్‌లను కూడా వెల్లడించాయి. ఈ క్రమంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడే తమ తుది జట్టుపై అంచనా వేశాడు. మైకెల్ నాసెర్‌ను తీసుకొనేందుకు మొగ్గు చూపడంపై  పాంటింగ్‌ మద్దతుగా నిలిచినప్పటికీ.. భారత్‌తో పోరులో మరో పేసర్‌ నిర్ణయాత్మకమవుతాడని పేర్కొన్నాడు. నాసెర్  కేవలం రెండు టెస్టులను మాత్రమే ఆడాడు. 

‘‘ఇంగ్లీష్‌ పిచ్‌ పరిస్థితులపై నాసెర్‌ భయంకరమైన బౌలర్‌. కౌంటీ క్రికెట్‌లో అతడి బౌలింగ్‌ను చూశాం. సరిగ్గా ఓవల్ పిచ్‌కు సరిపోతాడు. నాసెర్ వికెట్లను తీయడంతోపాటు బ్యాటింగ్‌ చేయడం అదనంగా కలిసొచ్చే అంశం. గత కౌంటీ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. అన్ని నైపుణ్యాలు ఉన్న ఆటగాడు. స్కాట్ బొలాండ్‌ కూడా ప్రభావం చూపిస్తాడు’’ అని పాంటింగ్‌ తెలిపాడు. హేజిల్‌వుడ్, షాన్‌ మార్ష్‌ గాయం నుంచి కోలుకుని రావడం వల్ల జట్టు మరింత బలోపేతమవుతుందని చెప్పాడు. హేజిల్‌ వుడ్ ఫిట్‌నెస్‌ సాధించకపోతే మాత్రం అతడి స్థానంలో స్కాట్ బొలాండ్‌ను తీసుకోవాలని సూచించాడు.

పాంటింగ్‌ తుది జట్టు ఇదే..

ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్ వార్నర్, మార్నస్‌ లబుషేన్, స్టీవ్‌ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియన్, స్కాట్ బొలాండ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని