పంత్‌.. రూట్‌.. స్టోక్స్.. గరం గరం..!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్‌ఇండియా 300/6 స్కోర్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. రోహిత్‌(161) భారీ శతకానికి తోడు రహానె(67) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు...

Published : 14 Feb 2021 09:34 IST

చెన్నై: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్‌ఇండియా 300/6 స్కోర్‌తో మెరుగైన స్థితిలో నిలిచింది. రోహిత్‌(161) భారీ శతకానికి తోడు రహానె(67) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో రిషభ్‌పంత్‌(33) ధాటిగా ఆడి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. అయితే, శనివారం ఆట చివరి ఓవర్‌ సందర్భంగా పంత్‌.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జోరూట్‌, బెన్‌స్టోక్స్‌తో మాటల యుద్ధానికి దిగాడు. 

తొలి రోజు మొత్తం 88 ఓవర్ల ఆట సాగగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌ 87వ ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. అయితే, పంత్‌ ఆ ఓవర్‌లో ఒక్కో బంతిని ఎదుర్కొనే క్రమంలో కాస్త ఆలస్యం చేశాడు. దాంతో తొలిరోజు ఆటను ఆ ఓవర్‌తోనే ముగిస్తారని భావించాడు. కానీ, పంత్‌ అనుకున్నట్లు జరగలేదు. ఆట నిలిచిపోయే సమయానికి ఇంకా ఒక నిమిషం ముందే రూట్‌ తన ఓవర్‌ను పూర్తి చేశాడు. దీంతో ఇంకో ఓవర్‌ ఆట సాగాల్సి వచ్చింది. బంతి అందుకున్న ఓలీస్టోన్‌ చివరి ఓవర్‌ను పూర్తి చేశాడు.

అయితే, స్టోన్‌ 88వ ఓవర్‌ వేయకముందు.. రూట్‌, స్టోక్స్‌, పంత్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. తొలుత టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఏదో అనుకోగా, తర్వాత స్టోక్స్‌ వచ్చి ఆజ్యం పోశాడు. దీంతో మళ్లీ పంత్, స్టోక్స్‌ మధ్య వాడీవేడీ సంభాషణలు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు ప్రశాంతంగా సాగిన తొలిరోజు ఆట చివర్లో ఇలాంటి పరిస్థితులకు దారి తీసింది. కాగా, చివరి ఓవర్‌లో పంత్‌ ఒక బౌండరీ బాది నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు అతడికి అక్షర్‌ పటేల్‌(5) తోడుగా నిలిచాడు.

ఇవీ చదవండి..
ఏమైంది రోహిత్‌? విరాట్‌ అమాయక ప్రశ్న!
రోహిత్ 97.. రితికా గుండె లబ్‌..డబ్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని