Rishabh Pant: టీమ్‌ ఇండియా కోసం పంత్‌ మెసేజ్‌..!

భారత స్టార్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ టీమ్‌ ఇండియా కోసం ప్రత్యేక మెసేజ్‌ పోస్టు చేశాడు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకొంటున్న అతడు ఇంటి వద్ద మ్యాచ్‌ చూస్తూ తన ఇన్‌స్టాలో ఈ సందేశం ఉంచాడు. 

Published : 09 Jun 2023 10:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2021-23 ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌(WTC Final)లో భారత్‌ ఫైనల్స్‌ చేరుకోవడంలో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) పాత్ర చాలా ఉంది. మొత్తం 12 మ్యాచ్‌ల్లో పంత్‌ 43.40 సగటుతో 868 పరుగులు సాధించాడు. వీటిల్లో రెండు శతకాలు.. ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. కానీ, దురదృష్టవశాత్తూ గతేడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో పంత్‌ ఇప్పుడు చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకొంటున్నాడు. తాజాగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ను పంత్‌ ఇంటి వద్ద నుంచి వీక్షిస్తున్నాడు. పంత్‌ స్థానంలో తెలుగు ఆటగాడు కేఎస్‌ భరత్‌ బరిలోకి దిగాడు.

ఫైనల్స్‌ రెండో రోజు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ కోసం పంత్‌ తన ఇన్‌స్టాలో ఓ ప్రత్యేక స్టోరీని పోస్టు చేశాడు. భారత్‌ జట్టు అదృష్టాన్ని కాంక్షిస్తూ క్రాస్డ్‌-ఫింగర్స్‌తో పాటు లవ్‌ సింబల్‌ ఎమోజీని పోస్టు చేశాడు. పంత్‌ పోస్టు చేసిన మెసేజ్‌లో ఆసీస్‌ బౌలర్‌ గ్రీన్‌ భారత బ్యాటర్‌ పుజారాకు బౌలింగ్‌ చేస్తున్న దృశ్యం ఉంది. నాన్‌స్ట్రైకర్‌ వైపు కోహ్లీ ఉన్నాడు. అప్పటికే భారత్‌ రోహిత్‌, గిల్‌ వికెట్లను కోల్పోయింది. 

ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా విసిరిన 469 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ను ఛేజ్‌ చేస్తూ భారత్‌ సగం వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే సాధించింది. ప్రస్తుతం రహానే, భరత్‌ క్రీజులో ఉన్నారు. ఆసీసు తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ను అదిగమించాలంటే భారత్‌ మరో 318 పరుగులు చేయాల్సి ఉంది.

రిషబ్‌కు ప్రపంచ టెస్ట్‌ సిరీస్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. 2019-21 సీజన్‌లో కూడా 41 ఇన్నింగ్స్‌లో 1,575 పరుగులు సాధించాడు. అప్పట్లో అతడు 41.44 సగటుతో మూడు శతకాలు, తొమ్మిది అర్ధశతకాలు బాదాడు. ఆ సిరీస్‌లో అతడి అత్యధిక స్కోరు 146.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని