పంత్‌కే ఐసీసీ తొలి పురస్కారం

టీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ మరో ఘనత అందుకున్నాడు. ఐసీసీ కొత్తగా ఆరంభించిన ‘ఈ నెల మేటి ఆటగాడు’ పురస్కారానికి ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా అమ్మాయి షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.....

Published : 08 Feb 2021 17:45 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ మరో ఘనత అందుకున్నాడు. ఐసీసీ కొత్తగా ఆరంభించిన ‘ఈ నెల మేటి ఆటగాడు’ పురస్కారానికి ఎంపికయ్యాడు. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా అమ్మాయి షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ మేరకు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీసులో రిషభ్ పంత్‌ అదరగొట్టాడు. సిడ్నీ టెస్టులో 97, బ్రిస్బేన్‌ టెస్టులో 89* పరుగులు చేసి జట్టుకు సిరీస్‌ విజయం అందించాడు. అతడి ప్రదర్శనకు గాను ఐసీసీ ఈ పురస్కరాన్ని ప్రకటించింది. మరో ఇద్దరు నామినీలతో పోటీపడ్డ పంత్‌కు అత్యధికంగా ఓట్లు పడ్డాయి.

‘జట్టు విజయానికి తోడ్పాటు అందించడమే ఏ ఆటగాడికైనా అత్యుత్తమ బహుమానం. కానీ ఇలాంటి పురస్కారాలు ప్రతిసారీ మరింత మెరుగ్గా ఆడేందుకు యువకులకు ప్రేరణ అందిస్తాయి. నేనీ పురస్కారాన్ని ఆసీస్‌ విజయానికి కృషి చేసిన ప్రతి భారత క్రికెటర్‌కు అంకితమిస్తున్నాను. నాకు ఓటేసిన ప్రతి అభిమానికి కృతజ్ఞతలు’ అని పంత్‌ తెలిపాడు. చెపాక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ 91 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

‘ఆస్ట్రేలియాలో పంత్‌ ఆడిన రెండు సందర్భాలు భిన్నమైనవి, సవాల్‌తో కూడుకున్నవి. ఒకటి డ్రా చేసేందుకు మరొకటి విజయం సాధించేందుకు ఉపయోగపడ్డాయి. ఈ రెండు ఇన్నింగ్సుల్లో అతడు తన నైపుణ్యాలను, వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. చక్కని టెంపర్‌మెంట్‌ను చూపించాడు’ అని ఐసీసీ ఓటింగ్‌ అకాడమీ ప్రతినిధి రమీజ్‌ రాజా అన్నాడు. పాకిస్థాన్‌ జరిగిన వన్డే సిరీసులో దక్షిణాఫ్రికా అమ్మాయి ఇస్మాయిల్‌ ఏడు వికెట్లు తీసి సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతకు ముందు జరిగిన రెండో టీ20లో ఐదు వికెట్లు తీయడం గమనార్హం. అందుకే ఆమెకు పురస్కారం దక్కింది.

ఇవీ చదవండి
కోహ్లీ 1 లేదా 2 సెంచరీలు కొడతాడు
ఉత్తరాఖండ్‌ బాధితుల కోసం పంత్‌ ముందడుగు

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని