BCCI President: గంగూలీ స్థానంలో బిన్నీ..!

ప్రస్తుత భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ) ఛైర్మన్‌ సౌరబ్‌ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి.

Updated : 11 Oct 2022 13:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ఛైర్మన్‌ సౌరబ్‌ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఎంపికయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంగూలీ తర్వాత  బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్‌ రోజర్‌ బిన్నీ పదవి చేపట్టడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. 1983లో ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో రోజర్‌ బిన్నీ కూడా సభ్యుడు. ఆయన ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (కెఎస్‌సీఏ)లో ఆఫీస్‌ బేరర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గతంలో సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేసిన అనుభవం బిన్నీకి ఉంది. 

18వ తేదీన జరగనున్న ఎన్నికలు, వార్షిక సమావేశానికి సంబంధించి బీసీసీఐ డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌లో కేఎస్‌సీఏ కార్యదర్శి సంతోష్‌ మోహన్‌ పేరుకు బదులు ప్రతినిధిగా బిన్నీ పేరు బయటకు రావడంతో ఈ ఊహాగానాలను జోరందుకొన్నాయి. అక్టోబర్‌ 18వ తేదీన ముంబయిలో బీసీసీఐకి ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 11-12 తేదీల్లో జరుగుతుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 14వ తేదీ వరకు తుది గడువు. 

ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా స్థానం మారకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.  ఇక బీసీసీఐ ఉపాధ్యక్ష పదవి బరిలో రాజీవ్‌శుక్లా ముందుండగా.. జాయింట్‌ సెక్రెటరీ పోస్టుకు దేబోజిత్‌ సైకియా, రోహన్‌ జైట్లీలు పోటీ పడే అవకాశం ఉంది. లీగ్‌ క్రికెట్‌ ఛైర్మన్‌గా అరుణ్‌ ధుమాల్‌ ఎంపిక కావచ్చనే ప్రచారం జరుగుతోంది. ‘‘కేంద్ర మంత్రి వర్గంలోని ప్రభావవంతమైన వ్యక్తి  బోర్డు పదవుల ఎంపిక విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి. నిన్న సాయంత్రమే ముంబయి చేరుకున్న బీసీసీఐ ఛైర్మన్‌ గంగూలీ దిల్లీలోని పెద్దలతో మంతనాలు సాగించినట్లు సమాచారం. అయితే రెండోసారి దాదా పదవీకాలం పొడిగించేందుకు వారు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని