IPL 2023: ఎంఎస్ ధోనీకిదే చివరి సీజనా..? రోహిత్ సూపర్ ఆన్సర్

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత క్రేజ్‌ ఉన్న లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023). అందులోనూ ఎంఎస్ ధోనీ ఆట అంటే..  ఆటగాళ్లతోపాటు అభిమానుల్లో ఉత్సాహం వచ్చేస్తుంది. అయితే ప్రతి సీజన్‌కు ముందు అభిమానుల్లో మెదిలే అనుమానం ఒకటుంటుంది. దానిపై టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూటిగా స్పందించాడు.

Published : 29 Mar 2023 20:12 IST

ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ (IPL 2023) కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. గత రెండు సీజన్ల నుంచి టోర్నీ మొదలు కావడానికి ముందు ప్రతిసారి ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతూనే ఉంటుంది. కెప్టెన్ కూల్‌ ఎంఎస్ ధోనీకిదేనా చివరి సీజన్‌..? 2020లో  అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ధోనీ కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్‌ ఆరంభంలో కొన్ని మ్యాచుల్లో కెప్టెన్సీ వదిలేయడంతో అదే చివరిదని అంతా భావించారు. తీరా రెండో సగంలో రవీంద్ర జడేజా నుంచి జట్టు పగ్గాలను ధోనీ మళ్లీ అందుకొన్నాడు. ఈసారి సీజన్‌ కోసం ప్రాక్టీస్‌ను కూడా ధోనీ షురూ చేసేశాడు. అయినాసరే మళ్లీ అదే అనుమానం.. ఇదేనా చివరి సీజన్‌..? దీనికి టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ సమాధానం ఇచ్చేశాడు. 

‘‘నేను గత మూడేళ్లుగా ఇవే మాటలు వింటూ ఉన్నా. ధోనీకి ఇదేనా చివరి సీజన్‌ అని తరచూ చర్చ జరుగుతూ ఉంది. అయితే, ధోనీ ఫిట్‌నెస్‌ను చూస్తే కనీసం మరో మూడు సీజన్లు ఆడతాడని భావిస్తున్నా’’ అని రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయికి పడిపోయింది. బుమ్రా లేకుండానే ఈసారి బరిలోకి దిగనుంది. 

రుతురాజ్‌ కీలకం: ఆకాశ్‌ చోప్రా

ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు యువ బ్యాటర్ రుతురాజ్‌ గైక్వాడ్‌ కీలకమవుతాడని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘రుతురాజ్‌ అద్భుతమైన ఆటగాడు. ఈ సీజన్‌లోనూ సీఎస్‌కేకు గైక్వాడ్ కీలకమవుతాడు. అయితే, రుతురాజ్‌ ఇప్పటి వరకు ఆడుతున్న విధంగా కాకుండా జోరు పెంచాలి. ఆరంభంలో నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించి తర్వాత దూకుడు పెంచుతాడు. అయితే డీజిల్‌ ఇంజిన్స్‌ కాలం మారిపోతోంది. ఇప్పుడంతా ఎలక్ట్రిక్‌ వాహనాల హవా. అందుకు తగ్గట్టుగా రుతురాజ్‌ మారిపోవాలి. ఇక బెన్‌ స్టోక్స్‌ను తీసుకోవడం సరైన నిర్ణయంగా అనిపించదు. మిడిలార్డర్‌లో అతడు ఎలా రాణిస్తాడనేది చూడాలి’’ అని చోప్రా తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని