IND vs BAN: బంగ్లాతో తొలి వన్డే.. అభిమానుల మద్దతుపై రోహిత్‌ శర్మ కామెంట్‌

టీమ్‌ఇండియాకు అభిమానుల మద్దతు గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇలా స్పందించాడు. 

Updated : 04 Dec 2022 15:27 IST

ఢాకా: టీమ్‌ఇండియాతో తొలి వన్డే కోసం భారత బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్‌ ఆటగాళ్లంతా ఈసారి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘‘టీమ్‌ఇండియాకు ప్రపంచమంతా అభిమానులు ఉంటారు’’.. అంటూ విలేకరి తన ప్రశ్నను మొదలు పెట్టగానే రోహిత్‌ కల్పించుకుని ‘‘ఒక్క బంగ్లాదేశ్‌లో తప్ప’’ అంటూ దానిని పూర్తిచేశాడు. అనంతరం మాట్లాడుతూ.. అందుకు గల కారణాలను వివరించాడు. వేదిక ఏదైనా తమ జట్టు పోరాడేందుకు సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నాడు. 

‘‘మ్యాచ్‌ చూడటానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య కాస్త కంగారు పెట్టేవిధంగానే ఉండవచ్చు. అయితే వారంతా క్రికెట్‌ను ఎంతో అభిమానించేవారు. వారి జట్టుకు మద్దతునివ్వడానికి వస్తుంటారు. సొంత గడ్డపై ఆడే జట్టుకు అది మరింత ఉత్సాహాన్నిస్తుంది. అయితే, ఈ వేదికపై మాకు అభిమానుల మద్దతు లేకపోయినా మా ఆటగాళ్లకు ఎలాంటి నష్టం లేదు.  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లో ఆడిన అనుభవం మాకుంది. అక్కడ సైతం మ్యాచ్‌ చూసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. వారు కూడా తమ జట్లను ఉత్సాహపరచాలనుకుంటారు. ఎక్కడైనా ఇదే జరుగుతుంది. ఒత్తిడిని అధిగమించడం, సవాళ్లను ఎదుర్కోవడం మా ఆటగాళ్లకు అలవాటే. కాబట్టి అదేమీ సమస్య కాదు’’ అంటూ రోహిత్‌ శర్మ బదులిచ్చాడు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని