IND vs NZ: సహచరులంతా.. అతడిని మాంత్రికుడిగా అభివర్ణిస్తారు: రోహిత్‌ శర్మ

టీమ్‌ఇండియా (Team India) వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC Rankings) అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌పై (IND vs NZ) భారత్‌ వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. గిల్‌, శార్దూల్‌ ఠాకూర్‌తోపాటు రోహిత్ శర్మ రాణించారు. ఈ క్రమంలో వారిద్దరిపై రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Updated : 25 Jan 2023 17:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరుసగా మూడో సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకొంది. శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లను దక్కించుకొన్న విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్‌పైనా వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడేళ్ల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో శతకం సాధించాడు. గిల్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తూ టోర్నీలోనే అత్యధిక పరుగుల వీరుడిగా మారాడు. అలాగే కీలక సమయంలో వికెట్లను తీసిన శార్దూల్‌ ఠాకూర్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మ్యాచ్‌ అనంతరం గిల్‌, శార్దూల్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలతో ముంచెత్తాడు. 

‘‘మా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. మా ప్రణాళికలకు అనుగుణంగా ఆడాం. శార్దూల్‌ ప్రత్యేకంగా నిలిచాడు. కీలక సమయంలో వికెట్లు తీశాడు. అందుకే జట్టు సహచరులంతా అతడిని మాంత్రికుడిగా అభివర్ణిస్తారు. సరైన సమయంలో బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇలాంటి అద్భుతమైన మరిన్ని మ్యాచ్‌లను ఇంకా ఆడాలి. కుల్‌దీప్‌ యాదవ్‌ చేతికి ఎప్పుడు బంతినిచ్చినా బ్రేక్‌ ఇస్తూ ఉంటాడు. రిస్ట్‌ స్పిన్నర్లు అద్భుతం చేయగలరు’’

‘‘గత ఆరు మ్యాచుల్లో అద్భుతంగా ఆడాం. 50 ఓవర్ల క్రికెట్‌లో సరైన నిర్ణయాలను తీసుకొంటూ ముందుకు సాగుతున్నాం. చాలా నిలకడగా ఆడుతున్నాం. షమీ, సిరాజ్‌ లేకుండా రిజర్వ్‌ బెంచ్‌పై ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకొన్నాం. చాహల్‌, ఉమ్రాన్‌కు ఛాన్స్‌ ఇచ్చి ప్రయత్నించాం. ఒత్తిడిలో ఎలా ఆడతారనేది తెలుసుకోవాలని భావించాం. మేం భారీ స్కోరు సాధించాం. అయితే ఇంత లక్ష్యమైనా సరే సురక్షితం కాదని నాకూ తెలుసు. ‘ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైన శుభ్‌మన్‌ గిల్‌ దానికి పూర్తి అర్హుడు. గత ఇన్నింగ్స్‌లకు సంబంధించిన భావోద్వేగాలను గిల్‌ ఏమాత్రం తన వద్ద అట్టిపెట్టుకోడు. ఎప్పటికప్పుడు తాజాగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం అభినందనీయం’’ అని రోహిత్ వెల్లడించాడు. 

ఆనందంగా ఉంది..

దాదాపు మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ సాధించడంపైనా రోహిత్ స్పందించాడు. ‘‘ఇలా శతకం చేయడం ఆనందంగా ఉంది. బ్యాటింగ్‌ బాగా చేశా. నా కెరీర్‌లో ఇదొక అదనపు మైలురాయి. ఇండోర్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. వన్డేల్లో భారత్‌ అగ్రస్థానానికి చేరుకోవడం పెద్ద విషయమేమీ కాదు. మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో దీని గురించి ఏమీ అనుకోలేదు. కేవలం మ్యాచ్‌ ఫలితం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇదే ఆత్మవిశ్వాసంతో బోర్డర్ - గావస్కర్ టెస్టు సిరీస్‌లో రాణిస్తామనే నమ్మకం ఉంది’’ అని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని