Rohit: డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి ఆలోచించడం లేదు.. ఈ మ్యాచ్‌ తప్పిదాలపై చర్చిస్తాం: రోహిత్‌

మూడో టెస్టులో (IND vs AUS) ఓటమికి గల కారణాలను త్వరగానే అన్వేషించి.. తప్పిదాలను సరి చేసుకుంటామని టీమ్‌ఇండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తెలిపాడు.

Updated : 03 Mar 2023 17:16 IST

ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భాగంగా మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు (Team India) తొలి ఓటమి ఎదురైంది. ఇందౌర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో (IND vs AUS) ఘన విజయం సాధించింది. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఆసీస్‌ బౌలర్‌ నాథన్ లైయన్ ఎంపికయ్యాడు. దీంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. చివరి టెస్టు మార్చి 9న అహ్మదాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది. అయితే, మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు. 

‘‘ఒక టెస్టు మ్యాచ్‌లో ఓడిపోతే.. చాలా విషయాలు మన చేతుల్లో లేవని అర్థం. తొలుత బ్యాటింగ్‌లో సరైన ఆరంభం దక్కలేదు. ప్రత్యర్థి 80 - 90 పరుగుల ఆధిక్యం సాధించాక.. తొలి ఇన్నింగ్స్‌లో మా స్కోరు బోర్డుపై మరిన్ని పరుగులు ఉంటే బాగుండేదనిపించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ అనుకున్న విధంగా బ్యాటింగ్‌ సాగలేదు. ఆసీస్‌కు కేవలం 76 పరుగులనే లక్ష్యంగా నిర్దేశించాం. తొలి రెండు మ్యాచుల్లో ఎలా రాణించాం.. ఇప్పుడీ మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయామనేదానిపై అందరం కలిసి చర్చించుకుంటాం. ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి ఆలోంచించలేదు. తర్వాత అహ్మదాబాద్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. పిచ్‌లతో సంబంధం లేకుండా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. సవాళ్లతో కూడుకున్న పిచ్‌లపై ధైర్యంగా ఆడాలి. బౌలింగ్‌లో రాణించినప్పటికీ.. బ్యాటింగ్‌లో ఆ తెగువ చూపించలేకపోయాం. ప్రణాళికలను అమలు చేయడంలో జరిగిన తప్పిదాల వల్లే ఇలా ఓటమిబాట పట్టాల్సి వచ్చింది. తప్పకుండా పుంజుకుంటాం. మూడు రోజుల్లో మ్యాచుల్లో అన్ని చోట్లా జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో ఇలా జరిగింది. మరీ ఐదు రోజులు ఆడి మీకు (అభిమానులకు) బోర్‌ కొట్టించాలని అనుకోవడం లేదు’’ అని రోహిత్ తెలిపాడు. 

మేం అనుకున్నట్లుగానే..: స్మిత్

‘‘మ్యాచ్‌కు సంబంధించిన నేను ఏమనుకున్నానో అలాగే జరిగింది. తొలి రోజు మేం టాస్‌ ఓడి మొదట బౌలింగ్‌ చేయడం కలిసొచ్చింది. మా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. తొలి రోజు కునెమన్‌ సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు. ఇక బ్యాటింగ్‌లో ఉస్మాన్‌ ఖవాజా తొలి ఇన్నింగ్స్‌లో మమ్మల్ని కాపాడాడు. అయితే, రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ మళ్లీ రేసులోకి వస్తుందని అనుకున్నా. అందుకు తీవ్రంగానే పోరాడింది. క్లిష్టపరిస్థితుల్లో పుజారా అద్భుతంగా ఆడాడు. కానీ, నాథన్‌ లయన్‌ మాత్రం 8 వికెట్లతో టీమ్‌ఇండియాను దెబ్బతీశాడు. ఇక చివరి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను డ్రా చేస్తామని భావిస్తున్నా. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లడం ఆనందంగా ఉంది. మా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ గురించి మేం ఆలోచిస్తున్నాం. తప్పకుండా నాలుగో టెస్టుకు వస్తాడనే నమ్మకముంది. నేను, నా కెప్టెన్సీని చాలా ఎంజాయ్‌ చేశా’’ అని స్మిత్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని