సచిన్‌కు సలామ్‌.. ధోనీతో హైటెన్షన్‌!

సచిన్‌ తెందుల్కర్‌.. ఓ పరుగుల యంత్రం, ప్రపంచ క్రికెట్‌లో సంచలనం. ప్రత్యర్థి ఎవరైనా, సహచరులు వెనుదిరుగుతన్నా తనకి తెలిసిన మంత్రం ఒక్కటే..

Updated : 24 Feb 2021 10:46 IST

చరిత్ర మొదలై నేటికి 11 ఏళ్లు

సచిన్‌ తెందుల్కర్‌.. ఓ పరుగుల యంత్రం, ప్రపంచ క్రికెట్‌లో సంచలనం. ప్రత్యర్థి ఎవరైనా, సహచరులు వెనుదిరుగుతన్నా తనకి తెలిసిన మంత్రం ఒక్కటే.. పరుగుల వరద పారించడం. 16 ఏళ్ల వయసులోనే రికార్డుల వేటను మొదలుపెట్టిన సచిన్‌కు నేడు ప్రత్యేకమైన రోజు. ద్విశతక చరిత్రకు అతడు నాంది పలికి నేటితో సరిగ్గా 11 ఏళ్లు పూర్తయ్యాయి.

2010, ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాపై అతడు చేసిన ద్విశతకం క్రికెట్‌ ప్రపంచాన్ని ఊపేసింది. అసాధ్యం అనుకున్న డబుల్‌ సెంచరీని సుసాధ్యం చేసి చూపించాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే అతడు ద్విశతకం సాధిస్తున్న సమయంలో క్రికెట్‌ ప్రపంచమంతా మునివేళ్ల మీద నిలబడింది. ధోనీ ధనాధన్‌ బ్యాటింగ్‌ చేస్తూ అతడికి ఎక్కువ స్ట్రైకింగ్ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. తెందుల్కర్‌ 200 సాధిస్తాడా లేదానని అభిమానుల్లో టెన్షన్‌ మొదలైంది. మొత్తంగా ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో సచిన్‌ సాధించాడు. ఆ మధుర క్షణాలను మాస్టర్‌ బ్లాస్టర్‌ ఎలా అందుకున్నాడంటే..

2010లో భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. కానీ మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో టీమిండియా ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఓటమి ప్రతీకారాన్ని తీర్చుకుందామని రెండో వన్డేలో బరిలోకి దిగిన సఫారీలకు మరోసారి చుక్కెదురైంది. ఆదిలోనే సెహ్వాగ్‌ను ఔట్‌ చేసిన ఆనందం వారికి ఎక్కువ సేపు నిలవలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్‌ కార్తీక్‌తో కలిసి మాస్టర్‌ బ్లాస్టర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 194 పరుగులు జోడించారు. కార్తీక్‌ ఔటైన అనంతరం యూసఫ్‌ పఠాన్‌ మెరుపులు మెరిపించి వెనుదిరిగాడు. అప్పటికీ సచిన్‌ 150 పూర్తిచేసుకున్నాడు.

ధోనీతో టెన్షన్‌ టెన్షన్‌..

పఠాన్‌ ఔటైన తర్వాత ధోనీ క్రీజు‌లోకి వచ్చాడు. ధోనీ స్ట్రైకింగ్‌ ఎక్కువగా తీసుకుంటూ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 ఓవర్లకు సచిన్‌ 190 పరుగులు పూర్తిచేశాడు. కానీ 191 నుంచి ఒక్కో పరుగు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మరోవైపు చూస్తుండగానే ధోనీ 17 పరుగుల నుంచి 60 పరుగులు పూర్తిచేశాడు. స్ట్రైకింగ్‌ ఎక్కువ రాకపోవడంతో సచిన్‌ మాత్రం 199లోనే ఉన్నాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌ వచ్చేసింది. అభిమానుల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది.

50వ ఓవర్‌లో తొలి బంతిని ధోనీ సిక్సర్‌ బాదాడు. తర్వాత బంతికి సింగిల్ తీయడంతో సచిన్‌కు స్ట్రైకింగ్ వచ్చింది. లాంగ్వెల్డ్‌ మూడో బంతిని ఆఫ్‌స్టంప్‌ అవతలకు విసిరాడు. సచిన్‌ ఫీల్డర్ల మధ్యలో నుంచి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా బాది సింగిల్‌ తీసి ద్విశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఎన్నో మైలురాళ్లను అందుకున్న సచిన్‌ మరో అద్భుతాన్ని సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్‌ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది అభిమానులకి. మీ అందరికీ ధన్యవాదాలు. ‘సచిన్‌.. సచిన్‌..’  అంటూ మీరు చేసే నినాదాలు తుది శ్వాస వరకు నా చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి- సచిన్‌

ఇప్పటివరకు వన్డేల్లో సచిన్‌ తర్వాత ఏడు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. వాటిలో నాలుగు భారత ఆటగాళ్లవే. 2011లో వెస్టిండీస్‌పై సెహ్వాగ్‌ 219 పరుగులు చేశాడు. అతడి తర్వాత రోహిత్‌ శర్మ ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీ బాదాడు. ఆసీస్‌పై ఒకసారి, శ్రీలంకపై రెండు సార్లు ద్విశతకం చేశాడు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌ గేల్‌, కివీస్‌ ఆటగాడు గప్తిల్, పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఫకర్‌ జమాన్‌ కూడా ద్విశతకాన్ని అందుకున్నారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని