IPL 2021: నాకు అత్యంత ఫ్రస్ట్రేషన్‌ సీజన్‌ ఇదే: సంజయ్‌ మంజ్రేకర్‌

ఐపీఎల్ 2021 సీజన్‌ గురించి వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌

Updated : 16 Oct 2021 06:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్ క్రికెట్‌కు సంబంధించి ఏ అంశంపైనైనా తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెబుతాడనే పేరుంది. మరి ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్‌ అయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) శుక్రవారం ముగిసింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు సెషన్‌లవారీగా క్వాలిఫయర్‌లతో కలిపి ఇప్పటి వరకూ 59 మ్యాచ్‌లు జరిగాయి. ప్రతి మ్యాచ్‌కు సంబంధించి సంజయ్‌ మంజ్రేకర్‌ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2021 సీజన్‌ గురించి.. ఆటగాళ్ల ప్రదర్శనపై తనదైన శైలిలో మంజ్రేకర్ విశ్లేషించారు. 

టాప్‌ ప్లేయర్స్‌పై ఆగ్రహం..

రవిచంద్రన్ అశ్విన్‌ టీ20లకు పనికి రాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మంజ్రేకర్‌ మరోసారి అగ్రశ్రేణి క్రీడాకారులపై విరుచుకుపడ్డాడు. అత్యున్నత స్థాయి ఆటను ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ప్రదర్శించలేకపోయారని అన్నాడు. సీఎస్‌కే కెప్టెన్‌ ధోనీ సహా ఆటగాడు సురేశ్‌ రైనా, సన్‌రైజర్స్‌ క్రికెటర్ మనీశ్‌ పాండే, డీసీ రిషభ్‌ పంత్, విలియమ్సన్, వార్నర్‌ వంటి ఆటగాళ్లు అంచనాలను అందుకోలేకపోయారు. క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ ముగిశాక సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడాడు. ‘ఈ సీజన్‌ లీగ్‌ దశ ఐపీఎల్‌ మ్యాచులు చాలా విచిత్రంగా ముగిశాయి. ప్రస్తుత ఎడిషన్‌లో సామర్థ్యంపరంగా స్థిరమైన ఆటగాళ్లు, సాధారణంగా కనిపించి అద్భుత ఆటను ప్రదర్శించిన వారి మధ్య చాలా తేడా ఉంది. ఐపీఎల్‌లోని అన్ని మ్యాచ్‌లను దగ్గర్నుంచి చూశా. మిగతా సీజన్‌లతో పోలిస్తే ఇదో ప్రత్యేకమైన ఐపీఎల్‌. ఎందరో నాణ్యమైన యువ ఆటగాళ్లను చూశాను. అలాగే పలు ఆసక్తికరమైన ముగింపు ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ ప్రస్తుత సీజన్‌ నాకు అత్యంత నిరాశపరిచిన (ఫ్రస్ట్రేటింగ్‌) ఐపీఎల్‌. ప్రారంభంలో పైచేయి సాధించిన జట్లు చివర్లో తేలిపోయాయి’ అని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌ 2021 గురించి మంజ్రేకర్‌ ఏం చెప్పాలనుకుంటున్నారో దానికి సరైన ఉదాహరణగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ను చెప్పొచ్చు. అప్పటి వరకూ గెలుపు దిశగా సాగుతున్న కేకేఆర్‌ ఒక్కసారిగా భారీ కుదుపులకు గురై ఓటమి అంచుకు చేరింది. చివరి మూడు ఓవర్లలో కేవలం 11 పరుగులు చేయాల్సిన తరుణం.. ఇంకా ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. అలాంటప్పుడు దిల్లీ బౌలర్ల ధాటికి కేకేఆర్‌ వణికిపోయింది. టాప్‌ బ్యాటర్లు మోర్గాన్‌, కార్తిక్, షకిబ్‌, నరైన్‌ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో దిల్లీ విజయం సాధించేలా కనిపించింది. అయితే త్రిపాఠి ఆఖర్లో సిక్సర్‌తో ఫైనల్‌ బెర్తును కేకేఆర్‌కు ఖరారు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని