CSK vs RR: ‘ధోనీ’ పేరెత్తని సంజూ.. ‘ఆ వ్యక్తి’ అని అనడంపై నెట్టింట్లో వైరల్!

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో (IPL 2023) రాజస్థాన్ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తాజాగా చెన్నైను చెపాక్‌ వేదికగా ఓడించి మరీ ఆధిక్యత సాధించింది. 

Published : 13 Apr 2023 19:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 16వ సీజన్‌లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో ధోనీ (MS Dhoni) దూకుడుగా ఆడినా చెన్నైను గెలిపించుకోలేకపోయాడు. సీఎస్‌కే సొంతమైదానమైన చెపాక్‌లో ఆ జట్టును ఓడించడంపై రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ సంజూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ధోనీ పట్ల ఉన్న విశ్వాసం, అభిమానం సంజూతో ఇలా మాట్లాడించి ఉంటుందని నెటిజన్లు పేర్కొన్నారు. సంజయ్‌ మంజ్రేకర్ అడిగిన ప్రశ్నలకు సంజూ శాంసన్‌ సమాధానం ఇచ్చాడు. ఇంతకీ సంజూ ఏమన్నాడంటే..?

‘చివరి రెండు ఓవర్లు ఉన్నప్పుడు.. మ్యాచ్‌ మీ చేతుల్లోనే ఉందని అనుకున్నావా?’ అని మంజ్రేకర్‌ ప్రశ్నించగా.. సంజూ స్పందిస్తూ ‘అస్సలు అనుకోలేదు’ అని చెప్పాడు. అప్పటికే క్రీజ్‌లో ఎంఎస్ ధోనీతో పాటు రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇంకా 12 బంతుల్లో 40 పరుగులు చేయాలి. ‘ఆ వ్యక్తి (ధోనీ) క్రీజ్‌లో ఉన్నప్పుడు సేఫ్‌గా ఉన్నామని మేం అనుకోలేదు. అతడికి తప్పకుండా గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే కొన్నేళ్లుగా ఏం సాధించాడనేది మనకు తెలుసు. చివరి బంతి ముగిసే వరకు విజయం కోసం పోరాడాల్సిందే. ధోనీని అడ్డుకోవడానికి కసరత్తు కూడా ఏమి చేయలేదు. ఇక నేను బ్యాటింగ్‌లో కేవలం రెండు బంతులను మాత్రమే ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా వికెట్‌ సమర్పించుకోవడం నిరాశపరిచింది’’ అని సంజూ తెలిపాడు. ధోనీ కేవలం 17 బంతుల్లోనే 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని